
- కొలిక్కి వచ్చిన మీ-సేవ దరఖాస్తుల సర్వే
- ప్రజాపాలన, గ్రామ సభల అప్లికేషన్లు క్రాస్ చెక్
నిజామాబాద్, వెలుగు : కొత్త రేషన్కార్డులకు అర్హుల ఎంపికను త్వరగా పూర్తి చేయాలని రెవెన్యూ శాఖను తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లా యంత్రాంగం కొత్త రేషన్ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తూ రోజువారి లక్ష్యాన్ని పెట్టుకుంది. మీ-సేవా అప్లికేషన్ల సర్వే కొలిక్కి రాగా వాటిని ప్రజాపాలన, గ్రామ సభల దరఖాస్తులను మరోసారి పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఉన్న కార్డులలో ఈ నెల 4, 453 మంది కొత్త సభ్యులను చేర్చిన అధికారులు, మరో 20 వేల మందిని చేర్చాలని కోరుతూ సివిల్ సప్లయ్ కమిషనర్కు ఈ నెల 5న నివేదిక పంపారు.
దరఖాస్తుల పరిశీలనపై ఫోకస్
జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్య 4,02,217 ఉండగా, 13,10012 లబ్ధిదారులు ఉన్నారు. కొత్తగా చేర్చిన 4,453 మంది లబ్ధిదారులతో కలిపి మొత్తం 13,14,465 మందికి ఈ నెల సన్న బియ్యం కోటాను సివిల్ సప్లయ్అధికారులు పంపారు. సన్నబియ్యం పంపిణీ ప్రారంభించాక కొత్త రేషన్ కార్డుల కోసం ఒత్తిడి పెరిగింది. జనవరి 2015 నుంచి మీ-సేవలో కొత్త రేషన్ కార్డుల కోసం 88,289 అప్లికేషన్లు సివిల్ సప్లయ్కి అందాయి.
2024 జనవరిలో గవర్నమెంట్ నిర్వహించిన ప్రజాపాలనలో 65,205 కుటుంబాలు దరఖాస్తులు చేసుకున్నాయి. ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన గ్రామ సభల్లో మరో 81,148 దరఖాస్తులు వచ్చాయి. ఇలా కొత్త కార్డుల కోసం మూడు దఫాలుగా దరఖాస్తులు చేసుకోవడం వల్ల ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉంది. మీ-సేవ అప్లికేషన్ల ఫీల్డ్ సర్వే రిపోర్ట్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ నుంచి తహసీల్దార్ ద్వారా సివిల్ సప్లయ్ డీఎస్వోకు చేరుతుంది. ప్రభుత్వ అనుమతి లభించిన వెంటనే కొత్త కార్డులు మంజూరు చేసి బియ్యం కోటా రిలీజ్ చేస్తారు.
ఈ ప్రక్రియ జిల్లాలో దాదాపు ముగిసింది. అయితే ప్రజాపాలన, గ్రామ సభ దరఖాస్తులు సివిల్ సప్లయ్ కమిషనర్ లాగిన్కు (సీసీఎస్) అప్లోడ్ అయ్యాయి. ఫీల్డ్ రిపోర్ట్ డీఎస్వోకు సంబంధం లేకుండా డైరెక్ట్గా సీసీఎస్కు ఆన్లైన్లో వెళ్తుంది. ఇలా రెండు లాగిన్లలో ఉన్న రిపోర్ట్లు ఫిల్టర్ చేసి ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసేందుకు జిల్లాయంత్రాంగం కసరత్తును ముమ్మరం చేసింది.