రేషన్ తిప్పలు ఆరు సార్లు బయోమెట్రిక్, ఆరుసార్లు బియ్యం కాంటా

రేషన్ తిప్పలు  ఆరు సార్లు బయోమెట్రిక్, ఆరుసార్లు బియ్యం కాంటా
  • సర్వర్​ ప్రాబ్లం వస్తే మళ్లీ మొదటికి..
  • ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 దాకా షాప్​లు ఓపెన్​
  • అయినా రోజుకు 30 కార్డులు దాటని పంపిణీ

నిజామాబాద్​/ కామారెడ్డి, వెలుగు:  ఉమ్మడి జిల్లాలో రేషన్​ బియ్యం తీసుకోవడానికి ప్రజలు బేజారవుతున్నారు.  రోజంతా షాప్​ల ముందు క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడు నెలల బియ్యం ఒకేసారి ఇవ్వాలని సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పల్లెల్లో నెట్​వర్క్​ సమస్య, కొత్త సాఫ్ట్​వేర్​పై అవగాహన లేక డీలర్లు బయోమెట్రిక్​లతో కుస్తీ చేస్తుండడం కనిపిస్తుంది. బయోమెట్రిక్​, కాంటాలు మూడుసార్లు వేయాల్సి రావడంతో కనీసం ఒక్కరికి 25 నిమిషాలు పడుతోంది.  

సన్నబియ్యం షురూ చేశాక పెరిగిన డిమాండ్..​

నిజామాబాద్ జిల్లాలో 4,02,217 రేషన్​కార్డులుండగా, 13,10,012 మంది లబ్ధిదారులు ఉన్నారు. మొత్తం 759 షాపులుండగా ప్రతి నెలా 8,733 లక్షల మెట్రిక్​ టన్నుల రైస్ అవసరం. గతంలో ప్రతి సభ్యుడికి ఆరు కిలోల చొప్పున దొడ్డు రకం బియ్యం ఇచ్చేవారు. వాటిని ఎక్కువ మంది తినకుండా అమ్ముకునేవారు. డీలర్ల ఆధ్వర్యంలో దందా నడిచేది. ఏప్రిల్ నెల నుంచి స్టేట్ గవర్నమెంట్​ సన్నరైస్​ పంపిణీ షురూ చేశాక డిమాండ్​ పెరిగింది. ఇదివరకు రేషన్​దుకాణాల్లో కోటా వారంలో ముగిసేది. ఇప్పుడు ఒకేసారి మూడు నెలల బియ్యం ఇవ్వాలని కేంద్ర సర్కార్ ఆదేశించడంతో పరిస్థితి మారింది. ఈ-పాస్ మెషన్​లో కేంద్రం వాటా బియ్యం పంపిణీకి ఒకసారి స్టేట్ షేర్ ఇవ్వడానికి మరోసారి డీలర్లు బయోమెట్రిక్​ తీసుకోవాల్సి వస్తోంది.

 రైస్​ కాంటాలను రెండుసార్లు వేయాల్సి ఉంది.  ఈ రకంగా మూడు నెలల రైస్ పంపిణీకి ఆరుసార్లు బయోమెట్రిక్ వేలి ముద్రలు, ఆరుసార్లు కాంటాలు వేయాల్సి రావడంతో టైం ఎక్కువ తీసుకుంటోంది.  సర్వర్​ సమస్య తలెత్తినప్పుడు మొదటికొస్తుంది. బ్లూటూత్​కు లింక్​ చేసిన కొత్త సాఫ్ట్​వేర్​పై డీలర్లకు ట్రైనింగ్ ఇవ్వకపోవడంతో సమస్య ఉత్పన్నమవుతోంది. టార్గెWట్​ ప్రకారం మూడు నెలల రైస్​ మొత్తం 26,200 లక్షల మెట్రిక్​ టన్నులు ఈ నెల 30 దాకా ఇవ్వడం డీలర్లకు కష్టతరంగా మారింది. కామారెడ్డి జిల్లాలో 2,56,732 కార్డులుండగా 9,35,007 మంది లబ్ధిదారులు ఉన్నారు.   ప్రతి నెలా 5,907 లక్షల మెట్రిక్​ టన్నుల రైస్​ అవసరం కాగా, మూడు నెలల కోటా కలిపి మొత్తం 17,711లక్షల టన్నులు పంపిణీ ప్రహసనంగా మారింది. 

టోకన్​ సిస్టంకు ప్లాన్..​

కోవిడ్ లాక్​డౌన్​ టైంలో 2020 అక్టోబర్​లో సెంట్రల్ గవర్నమెంట్​ రెండు నెలల రైస్​ ఒకేసారి పంపిణీ చేయించింది. రేషన్​ షాప్​లు, స్కూల్​ రూమ్​లు, అంగన్​వాడీ సెంటర్లతో పాటు లోకల్​గా అందుబాటులో ఉన్న గవర్నమెంట్ బిల్డింగ్​ల్లో బియ్యం బస్తాలు  అన్​లోడ్​ చేసి చకాచకా నాలుగు రోజుల్లో పంపిణీ ముగించారు.  మధ్యాహ్నం అరగంట భోజన విరామం తప్పితే ఉదయం 8 గంటలకు తెరిచిన  షాప్​లు రాత్రి 10 గంటల వరకు 30 కార్డులకు పంపిణీ  దాటడం లేదు. ఎండకు తోడు ఉక్కబోత వాతావరణంలో నిలబడలేక సంచులు క్యూలో పెట్టి  నీడ వెతుక్కుంటున్నారు.

 కొందరు రోజంతా నిరీక్షించిన ఉత్తి చేతులతో వెళ్లి మరుసటి రోజు దుకాణం ఓపెన్​ చేయకముందే వచ్చి కూర్చుంటున్నారు. జిల్లాలో ఒక షాప్​కు కనీసం 500 నుంచి గరిష్ఠంగా 800 కార్డులున్నాయి. వీటింన్నిటికీ నెల రోజుల్లో పంపిణీ పూర్తి చేయడానికి టోకన్ సిస్టం పెట్టాలని యోచిస్తున్నారు. రోజుకు 25 కార్డుల చొప్పున పంపిణీకి ప్లాన్​ చేశారు.

డిలే కానీయం

రైస్​ పంపిణీకి నిర్ధిష్ఠ విధానం ఉంది. షాప్​ల్లో స్టాక్​ పూర్తయిన కొద్దీ రైస్ పంపుతాం. ఎక్కడా సమస్య రాకుండా సాఫీగా పంపిణీ జరిగేలా పర్యవేక్షిస్తున్నం. - మల్లికార్జునబాబు, డీఎస్​వో, కామారెడ్డి