ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
  • భద్రాచలం ఆర్డీవో దామోదర్​ రావు 
  • గోదావరి వరదలపై రివ్యూ

భద్రాచలం, వెలుగు :  జిల్లాలో గోదావరి పరివాహకంలోని  ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్డీవో దామోదర్​రావు ఆదేశించారు. ఆర్డీవో ఆఫీసులో శుక్రవారం ఏఎస్పీ విక్రాంత్​కుమార్​ సింగ్​ తో కలిసి గోదావరి వరదలు, ముందస్తు చర్యలపై ఆయన రివ్యూ మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా వరదల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అక్కడ మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని సూచించారు. శాఖల వారీగా వరద సహాయక చర్యల ప్రణాళికలపై చర్చించారు.

 అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గతంలో చేపట్టిన చర్యలు, ప్రస్తుతం చేయాల్సిన పనులు, ప్రాధాన్యతలు వివరించారు. ఉద్యోగులు ఎవరూ అనుమతి లేకుండా ముందస్తు సెలవులు తీసుకోవద్దని ఆదేశించారు. సమన్వయంతో సమష్టిగా పనిచేయాలన్నారు. బఫర్​ స్టాకులు, పునరావాస కేంద్రాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు, పశువులకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టాలు లేకుండా చూడాలన్నారు. గ్రామీణా ఆస్పత్రుల్లో మందులు స్టాక్​పెట్టుకోవాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు ఆటంకం కల్గకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఎస్​డీసీ రవీంద్రనాథ్​, తహశీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.