- 27వేల ఆక్సిజన్ బెడ్లు రెడీగున్నయి
- నెలాఖరుకల్లా వ్యాక్సినేషన్ పూర్తైతదని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ తరహా వైద్యం తీసుకొస్తామని మంత్రి హరీశ్ రావు అన్నారు. అందుకు తగ్గట్టుగా సర్కారు ఆస్పత్రుల్లో సౌలత్లు పెంచుతామన్నారు. ‘‘కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నం. 27వేల ఆక్సిజన్ బెడ్లు సిద్ధం చేసినం. ఒమిక్రాన్ తో ప్రాణాపాయం ఉండదని నివేదికలు చెప్తున్నయి. అయినా అంతా జాగ్రత్తగా ఉండాలె. ఈ నెలాఖరుకల్లా వ్యాక్సినేషన్ పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నం. టీఆర్ఎస్ హయాంలోనే నిమ్స్ బలపడింది. అందులో ఐసీయూ, వెంటిలేటర్ బెడ్లు పెంచుతున్నం” అని హరీశ్ అన్నారు. వైద్యశాఖలో లోటుపాట్లను సరి చేస్తామని చెప్పారు. తెలంగాణ వచ్చాక 12 మెడికల్ కాలేజీలు తెచ్చామని, మరో 5 సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు తెస్తున్నామని తెలిపారు. బుధవారం వీ6 వెలుగు ఇంటర్వ్యూలో హరీశ్ పలు విషయాలు పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే...
సర్కారు వైద్యంపై నమ్మకం పెంచాలె
వైద్య శాఖను బాధ్యతగా నిర్వహిస్తననే నమ్మకంతో అప్పజెప్పినరు. పేదలకు సేవ చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నం. ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెంచాలె. కార్పొరేట్ తో పోటీపడే స్థాయికి తేవాలన్నది నా తాపత్రయం.
కరోనాతో దెబ్బ
ఈ ఐదేండ్లలో విద్య, వైద్యాన్ని బలోపేతం చేయాలని సీఎం భావిస్తే దురదృష్టం కొద్దీ కరోనా ఇబ్బంది పెట్టింది. 5 కొత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లలో ఒకదానికి వరంగల్లో ఇప్పటికే శంకుస్థాపన జరిగింది. హైదరాబాద్ నలుదిక్కుల 4 హాస్పిటళ్లు ప్లాన్ చేస్తున్నం.
కిడ్నీ పేషెంట్లకు డయాలసిస్ కేంద్రాలు
ఉస్మానియాలో రెండు మూడు రోజుల్లో క్యాథ్ లాబ్ ప్రారంభిస్తం. గాంధీ హాస్పిటల్లో కూడా క్యాథ్ లాబ్కు ఆర్డరిచ్చినం. ఎంఆర్ఐపైనా రివ్యూ చేసినం. నిలోఫర్లో కూడా బెడ్స్ సాల్తలెవ్వని సీఎం భారీగా నిధులిచ్చిన్రు. అన్ని జిల్లాల్లో పిల్లలకు ప్రత్యేక ఐసీయూ, ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేసినం. నిలోఫర్లో కూడా 2000 బెడ్లకు పెంచుతూ కొత్త ఆస్పత్రి తీసుకొస్తం. తెలంగాణ రాకముందు హైదరాబాద్, వరంగల్లో మాత్రమే డయాలసిస్ కేంద్రాలుండేవి. మేం తాలూకాల్లో కూడా కేంద్రాలు, ఐసీయూ హాస్పిటళ్లు తెచ్చినం. 10 వేల మంది కిడ్నీ పేషెంట్లకు డయాలసిస్ కేంద్రాలు తెచ్చినం.
94 శాతం మందికి ఫస్ట్ డోసు
ఒమిక్రాన్ ను ఎదుర్కోవటానికి 25 వేల బెడ్లు ఆక్సిజన్ ఫెసిలిటీతో చిన్న పిల్లలకు కూడా 10 వేల బెడ్లు ఏర్పాటు చేసినం. తెలంగాణలో 94 శాతం ఫస్ట్ డోస్ వేసుకున్నరు. సెకండ్ డోస్లో కూడా 48శాతానికి చేరినం.
టీఆర్ఎస్ వచ్చాకే నిమ్స్ బలపడింది..
నిమ్స్పై నమ్మకంతో పేషెంట్లు భారీగా వస్తున్నరు. బెడ్లు 90 శాతం నిండుతున్నయి. బెడ్లు, వసతులు పెరగాల్సి ఉంది. వెంటిలేటర్లు, ఐసీయూ లేవని వెనక్కు పంపించే పరిస్థితి ఉంది. నిమ్స్లో 200 పడకల ఐసీయూ కేంద్రాలను నెలలోపు అందుబాటులోకి తేవాలని ఆదేశించినం. మరో 100 వెంటిలేటర్లు తెస్తున్నం. లేటెస్ట్ ఎక్విప్మెంట్ కోసం 154 కోట్లు మంజూరు చేసినం. 200 బెడ్ల ఎంసీయూ హాస్పిటల్ కూడా తేవాలని నిర్ణయించినం. ఉస్మానియా హాస్పిటల్ మీద కొందరు కోర్టుకు పొయ్యి స్టే తెచ్చి ఇబ్బంది పెట్టజూసిన్రు. కానీ దాని పక్కనే 1,000 పడకల హాస్పిటల్ కట్టే పరిస్థితి లేదు. దీన్ని త్వరగా తేల్చడానికి చూస్తున్నం. అనుబంధంగా కింగ్ కోఠి హాస్పిటల్ తీసుకొస్తున్నం. టిమ్స్లోనూ 1,000 బెడ్లు అందుబాటులో ఉన్నయి. ఉస్మానియాకు వచ్చిన ఏ ఒక్కరూ బెడ్స్ దొరకలేదని, ట్రీట్మెంట్ అందలేదని వాపస్ పోవొద్దనేదే మా ఉద్దేశం.