రాహుల్ గాంధీపై మరో కేసు...

రాహుల్ గాంధీపై మరో కేసు...

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో ఎంపీ పదవి కోల్పోయిన రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు నమోదైంది. ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ కోర్టులో ఆర్ఎస్ఎస్ కార్యకర్త కమల్ భదౌరియా పరువు నష్టం దావా కేసును వేశారు. దీనిపై ఏప్రిల్ 12న కోర్టులో విచారణ జరగనుంది.

ఎందుకు కేసు..

భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ అనేక బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఓ సభలో  ప్రసంగిస్తూ.. ఆర్ఎస్ఎస్పై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఆర్ఎస్ఎస్ వారిని 21వ శతాబ్దపు కౌరవులుగా రాహుల్ గాంధీ అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై హరిద్వార్ కోర్టులో  పరువునష్టం పిటిషన్ దాఖలైంది. 

ఏం వ్యాఖ్యలు చేశారు...

జనవరి 9 2023న హర్యానాలోని అంబాలాలో భారత్ జోడో యాత్ర ముగిసిన తర్వాత స్ట్రీట్-కార్నర్ సమావేశంలో రాహుల్ ప్రసంగించారు. ఈ సందర్భంగా RSS సభ్యులు 21వ శతాబ్దపు కౌరవులు" అని వ్యాఖ్యానించారు. "కౌరవులు ఎవరంటే...? నేను ముందుగా మీకు 21వ శతాబ్దపు కౌరవుల గురించి చెబుతాను. వారు ఖాకీ హాఫ్ ప్యాంట్‌లు ధరిస్తారు.  చేతిలో లాఠీలు పట్టుకుని, శాఖలు నిర్వహిస్తారు. భారతదేశంలోని 2-3 బిలియనీర్లు కౌరవులు  ఉన్నారు.." అని రాహుల్ గాంధీ అన్నారు. 

జైలు శిక్ష..ఎంపీగా అనర్హత...

ప్రధాని నరేంద్ర మోడీపై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై  గుజరాత్ లోని సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుపై  పై కోర్టులో అప్పీల్ చేసుకోవడానికి రాహుల్ గాంధీకి నెల రోజుల గడువిచ్చింది. అయితే  ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం  రాహుల్ గాంధీపై లోక్సభ చర్యలు తీసుకుంది. లోక్సభ సభ్యత్వానికి అనర్హుడిగా లోక్సభ సెక్రటేరియట్ ప్రకటించింది. ఆ తర్వాత రోజే ఎంపీగా ఢిల్లీలో రాహుల్ గాంధీకి కేటాయించిన ఇంటిని ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసింది. 

బిహార్..మహారాష్ట్రలోనూ..

రాహుల్ గాంధీపై బిహార్..మహారాష్ట్రలోని థానేలో కూడా  పరువు నష్టం కేసులు నమోదయ్యాయి.  మహాత్మా గాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్ కారణమని 2014 లో రాహుల్ గాంధీ ఓ బహిరంగ సభలో ఆరోపించారు. ఆ వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్  కార్యకర్త థానే కోర్టులో దావా వేశారు. అటు బిహార్లోని ఓ కోర్టులోనూ రాహుల్ గాంధీపై పరువునష్టం దావా కేసు నమోదైంది. ఆ కేసును బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ వేశారు.