
- రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
నిజామాబాద్, వెలుగు : గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 30 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్ను 27 శాతానికి తగ్గించి దొర పాలన సాగించారని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి విమర్శించారు. శుక్రవారం డిచ్పల్లి మండల కేంద్రంలోని కేఎన్ఆర్ గార్డెన్లో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి గవర్నమెంట్ బీసీ రిజర్వేషన్ను 42 శాతానికి పెంచి సామాజిక న్యాయం చేయాలని నిర్ణయించిందన్నారు. జిల్లాలో కొత్త రేషన్ కార్డులు 63,500 మంజూరు కాగా, రూరల్ సెగ్మెంట్ లో 16,116 ఉన్నాయన్నారు.
మొదటి విడతలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని, సెకండ్ విడతలో 75 గజాల స్థలంతో పాటు ఇండ్లు మంజూరు చేసి పేదలకు శాశ్వత నీడ కల్పిస్తామన్నారు. అవినీతి పాలన సాగించిన బీఆర్ఎస్కు పుట్టగతులు లేవన్నారు. కేసీఆర్ పామ్ హౌస్కు పరిమితం కాగా, కేటీఆర్ మతిలేని మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మిట్టపల్లి విలేజ్లో రాంపూర్ సింగిల్ విండో సొసైటీ నిర్మించిన గోదామ్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అదనపు కలెక్టర్ కిరణ్కుమార్, డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్రెడ్డి, ఆర్డీవో రాజేంద్రకుమార్, తహసీల్దార్ సతీశ్, డీసీసీబీ వైస్ చైర్మన్ నల్ల చంద్రశేఖర్రెడ్డి, తారాచంద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.