
- ఇబ్బందుల్లో వాహనదారులు
- పట్టించుకోని అధికారులు
సత్తుపల్లి, వెలుగు : సత్తుపల్లిలోని ఆర్టీవో ఆఫీస్లో సౌకర్యాలు లేక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. 37 ఏండ్ల కింద అద్దె భవనంలో ప్రారంభమైన ఆర్టీఏ కార్యకలాపాలు ఇంకా అలాగే కొనసాగుతున్నాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆర్టీవో ఆఫీస్కు సొంత భవనం మాత్రం ఏర్పాటు చేయలేకపోయాయి.
ఇప్పటికి మూడు సార్లు అద్దె భవనాలు మార్చినప్పటికీ కనీస మౌలిక సదుపాయాలు మాత్రం కల్పించలేకపోయారు. కనీసం టాయిలెట్స్ సదుపాయం లేక మహిళా సిబ్బంది, వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. భవనం అంతంతమాత్రంగానే ఉండడంతో వానా కాలం మరింత ఇబ్బందిగా ఉంటుంది. గతంలో భవనం కురిసి రికార్డులు సైతం తడిసిన ఘటనలు ఉన్నాయి.
రోడ్డు పైనే డ్రైవింగ్ టెస్ట్.. వానలోనే క్యూలైన్..!
ఆర్టీవో ఆఫీస్ లో అతిముఖ్యమైన డ్రైవింగ్ టెస్ట్ సాధారణంగా ఖాళీ ప్రదేశంలోనో, డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ పైనో అధికారులు నిర్వహిస్తారు. ఇక్కడ మాత్రం మెయిన్ రోడ్డు పైనే డ్రైవింగ్ టెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. పార్కింగ్కూ తిప్పలే ఉంది. రోడ్లపైనే వాహనాలను ఆపి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చేయాల్సిన దుస్థితి. ఏటా రూ.2కోట్లకుపైగా ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నా.. ఇక్కడ వాహనదారులకు కనీస సౌకర్యాలు కల్పించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
5 ఎకరాల స్థలం కావాలి
కార్యాలయం ఏ ఇబ్బంది లేకుండా నిర్వహిం చాలంటే 5 ఎకరాల స్థలం కావాలి. దీనిపై మూడేండ్ల కింద ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా స్థల సేకరణకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత ఆ ప్రక్రియ ఆగింది. ప్రస్తుతం ఎమ్మెల్యే ద్వారా స్థల సేకరణ, కార్యాలయ భవన నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నాం.– జేఎన్శ్రీనివాసరావు, ఎంవీఐ
కనీస సౌకర్యాలు లేవు
కార్యాలయంలో పని కోసం వెళ్తే కనీస సౌకర్యాలు లేవు. ప్రభుత్వానికి కోట్లల్లో ఆదాయం తెచ్చిపెట్టే ఈ కార్యాలయంలో వాహనదారుల కోసం కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. క్యూలైన్ కార్యాలయం బయటి వరకు ఉంటుంది. దీంతో వాహనదారులు ఎండొచ్చినా, వానొచ్చినా గంటల తరబడి నిలబడుతున్నారు. – గాదె నాగు వాహనదారుడు, సత్తుపల్లి