
హైదరాబాద్, వెలుగు: డీడీలు కట్టించి.. గొర్రెలు పంపిణీ చేయకుండా గొల్లకురుమలను అప్పులపాలు చేశారని గొర్రెలు – మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర కమిటీ విమర్శించింది. గొర్రెలు కొనుగోలు చేసుకునేందుకు వెంటనే నగదు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న రాష్ట్ర పశుసంవర్థకశాఖ ఆఫీస్ ముట్టడించాలని నిర్ణయించినట్ల కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ వెల్లడించారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జూన్ 9న రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభించినట్లు హడావిడి చేసి, రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 1,500 మందికి మాత్రమే ఇచ్చారు. 80 వేల మంది గొల్లకురుమలతో డీడీలు కట్టించి అప్పుల పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ప్లాన్లేకుండా, నిధులు విడుదల చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. 3.5 లక్షల మందికి రూ.6 వేల కోట్ల నిధులు మంజూరు చేసి నచ్చిన చోట కొనుక్కునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. రవీందర్తో అవిశెట్టి శంకరయ్య, బొల్లం అశోక్, మద్దెపురం రాజు, లింగయ్య, మల్లేశ్, కాల్వ సురేశ్తదితరులు ఉన్నారు.