మే 27న కేరళకు నైరుతి రుతుపవనాలు

మే 27న కేరళకు నైరుతి రుతుపవనాలు
  • నాలుగు రోజులు అటు ఇటుగా ఎంటరవుతాయన్న ఐఎండీ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు:నైరుతి రుతుపవనాలు ఈ సారి అతి త్వరగానే కేరళలోకి ప్రవేశించనున్నాయి. ఈ నెల 27న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం నైరుతి రుతుపవనాలపై ఫోర్​కాస్ట్​ను విడుదల చేసింది. నాలుగు రోజులు అటూఇటుగా రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలున్నట్టు తెలిపింది. మే 13న సౌత్​ అండమాన్​ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, నికోబార్​ దీవుల్లోకి ప్రవేశిస్తాయని తెలిపింది.

 ఆ తర్వాత నాలుగైదు రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమొరిన్, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్​ నికోబార్​ దీవుల్లోకి పూర్తిగా, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని వివరించింది. కాగా, ఇప్పటికే పలు చోట్ల వేసవి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని ఐఎండీ పేర్కొంది. మామూలుగా అయితే కేరళలోకి నైరుతి రుతుపవనాలు జూన్​ 1న ప్రవేశిస్తాయని, ఈ సారి మే 27 నాటికే వస్తాయని తెలిపింది. 

ఆరు అంశాల ఆధారంగా..

ఆరు అంశాల ఆధారంగా నైరుతి రుతుపవనాల రాకను అంచనా వేసినట్టు ఐఎండీ తెలిపింది. ఆగ్నేయ భారతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు, దక్షిణ భారతంలో ప్రీ మాన్సూన్​ వర్షాలు, ఆగ్నేయ పసిఫిక్​ మహాసముద్రంలో సగటు సముద్ర పీడనం, దక్షిణ చైనా సముద్రంలో రేడియేషన్​ తగ్గుదల, ఈశాన్య హిందూ మహాసముద్రంలో గాలులు, ఇండోనేసియా రీజియన్​లోని గాలుల ప్రభావం ఆధారంగా నైరుతి రుతుపవనాల ప్రవేశాన్ని అంచనా వేసినట్టు తెలిపింది. గత ఐదేండ్లు అంచనాలకు అనుగుణంగా నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయని తెలిపింది. 2020లో జూన్​ 5న ఎంటరవుతాయని అంచనా వేయగా.. అంతకన్నా నాలుగు రోజుల ముందుగానే జూన్​ 1న ప్రవేశించాయని వెల్లడించింది.  2023లో జూన్​ 4న వస్తాయని అంచనా వేస్తే జూన్​ 8న, 2024లో మే 31న కేరళలోకి ఎంటరవుతాయని ఫోర్​కాస్ట్​ ఇస్తే మే 30న రుతుపవనాలు ప్రవేశించాయని ఐఎండీ వెల్లడించింది.