
తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ మూడోసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శనివారం ఫిల్మ్ చాంబర్లో నిర్వహించిన 80వ జనరల్ బాడీ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. వైస్ ప్రెసిడెంట్స్గా రవీంద్ర గోపాల్, కె ఉదయ్ కుమార్ రెడ్డి ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీగా శ్రీధర్ బాబు, జాయింట్ సెక్రటరీగా జే చంద్ర శేఖర్ రావు, ట్రెజరర్గా బీ సత్యనారాయణ గౌడ్ ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన సభ్యులను ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సన్మానించి, అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ సునీల్ నారంగ్ మాట్లాడుతూ ‘సినీ ఇండస్ట్రీలోని సమస్యలపై ఒక కమిటీ వేశాం. కమిటీ రిపోర్టు ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పారు.
నూతనంగా ఎన్నికైన సెక్రటరీ శ్రీధర్ బాబు మాట్లాడుతూ ‘సింగిల్ స్ర్కీన్ థియేటర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 2016 నుంచి మేం పర్సంటేజ్ గురించి పోరాడుతున్నాం. బంద్ అని మేం ఎప్పుడూ చెప్పలేదు. ఇద్దరు నిర్మాతలు, ఇద్దరు దర్శకులు అందర్నీ తప్పుదోవ పట్టించి సమస్యను సృష్టించారు. పవన్ కళ్యాణ్ సినిమా కోసం థియేటర్స్ అన్నీ ఖాళీగా ఉంచాం. కానీ ఈ సినిమా విడుదల కాకపోవడంతో ఈనెల అంతా పోయింది. రీసెంట్గా కమల్ హాసన్ సినిమా విడుదలైంది కానీ మూడో రోజు నుంచే అనేక షోలు రద్దయ్యాయి. జనవరి నుంచి ఇప్పటివరకు కేవలం మూడు సినిమాల వలనే సింగిల్ స్ర్కీన్ థియేటర్స్కు రెంట్ వర్కవుట్ అయ్యింది. సంక్రాంతికి వస్తున్నాం, మ్యాడ్ స్క్వేర్, కోర్ట్ చిత్రాలు మినహా ఇప్పటివరకు వచ్చినవన్నీ డిజాస్టర్లే. అందుకే నిర్మాతలను ఆదుకోవాలని కోరుతున్నాం.
అనవసరంగా కొందరు సింగిల్ స్ర్కీన్స్ను బ్లేమ్ చేస్తున్నారు. హీరోలకు స్టార్డమ్ వచ్చింది సింగిల్ స్క్రీన్ల వల్లే. ఒకప్పుడు ఏడాదికి కనీసం రెండు, మూడు సినిమాలు చేసేవారు. ఇప్పుడు మాత్రం రెండు సంవత్సరాలకు ఒక్క సినిమానే చేస్తున్నారు. రీసెంట్గా ఓ హీరోకు వరల్డ్వైడ్గా రూ.రెండు కోట్లు షేర్ కూడా రాలేదు. కానీ ఆ హీరోకు రూ.13 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చారు. ఇది అసలు ఎక్కడికి పోతుందో అర్ధం కావడం లేదు’ అని చెప్పారు. నిర్మాతలు సురేష్ బాబు, దామోదర ప్రసాద్, అభిషేక్ అగర్వాల్, జెమినీ కిరణ్ కొత్తగా ఎన్నికైన జనరల్ బాడీకి బెస్ట్ విషెస్ చెప్పారు.