న్యూఢిల్లీ: మత మార్పిడి అంశం చాలా సీరియస్ ఇష్యూ అని, దీనికి రాజకీయ రంగు పులమొద్దు అని సుప్రీంకోర్టు హెచ్చరించింది. మోసపూరిత మత మార్పిడులను అరికట్టి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సి.టి రవికుమార్తో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అటార్నీ జనరల్(ఏజీ) ఆర్ వెంకటరమణిని బెంచ్ సాయం కోరింది. ఇలా జరిగినప్పుడు ఏం చేయాలి? దిద్దుబాటు చర్యలు ఏంటో చెప్పాలని ఇద్దరు జడ్జిల బెంచ్ ఏజీని కోరింది. తమ రాష్ట్రంలో ఎలాంటి మతమార్పిళ్లు జరగలేదని, ఈ పిల్ను రాజకీయ కక్షసాధింపు చర్యగానే చూడాలని తమిళనాడు తరఫు సీనియర్ అడ్వకేట్ విల్సన్ కోర్టుకు విన్నవించారు. ఈ కామెంట్లపై సుప్రీంకోర్టు అభ్యంతరం చెప్పింది. ‘‘మీరు ఈ కామెంట్లు చేయడానికి వేరే కారణాలు ఉండొచ్చు. కోర్టు ప్రొసీడింగ్స్ను ఇతర అంశాలతో ముడిపెట్టొద్దు. ఇది మీ రాష్ట్రంలో జరిగితే బాధాకరం.. జరగకపోతే మంచిదే.. కానీ, మేము దేశంకోసం ఆందోళన చెందుతున్నాం. దయచేసి ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దు” అని సుప్రీం కోర్టు పేర్కొంది.
అలాంటి జిల్లా అంటూ లేదు..
తాజా పిటిషన్పై తమ అభిప్రాయం చెప్పాలని సెప్టెంబర్ 23న కేంద్రానికి సుప్రీం కోర్టు సూచించింది. అడ్వకేట్ అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ సుప్రీం కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. దేశంలో ‘హుక్ అండ్ క్రూక్’ ద్వారా మత మార్పిడిలేని జిల్లా ఒక్కటీ లేదని పిటిషన్లో పేర్కొన్నారు.