- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు విమర్శ
నిర్మల్, వెలుగు : ‘కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు మతతత్వ పార్టీలు, విద్వేషాలు రెచ్చగొట్టి అధికారం చలాయించాలని చూస్తున్నారు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. సోమవారం నిర్మల్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీ, రోడ్షోలో ఆయన మాట్లాడారు. ‘గతంలో ఓ ఎంఐఎం నేత 15 నిమిషాల సమయం ఇస్తే చాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. కానీ మాకు 15 సెకండ్లు సరిపోతాయి.. కానీ మేము అలాంటి వారికి దూరం, బీజేపీ, ప్రధాని మోదీ ఆలోచన అంతా సబ్కా సాథ్.. సబ్కా వికాస్ మీదే ఉంది’ అని చెప్పారు.
బీజేపీని మతతత్వ పార్టీగా విమర్శించే ముందు మిగతా పార్టీలు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. గతంలో పదేండ్ల పాటు బీఆర్ఎస్, ఇప్పుడు ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీతో ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నాయన్నారు. ప్రజల కోసం బీజేపీకి ఓటు వేసి తెలంగాణను రక్షించాలని కోరారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు బెనిఫిట్స్ ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడుతోందని, రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. స్టూడెంట్లకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కూడా ఇవ్వలేదని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు.
మోదీ ప్రధాని బాధ్యతలు చేపట్టగా కేంద్రంలో ఒక్క అవినీతి కూడా జరగలేదని, కానీ రాష్ట్రంలో మాత్రం గత పదేండ్లలో వేల కోట్ల అవినీతి జరిగిందని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో సైతం అవినీతి పెరిగిపోయిందన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం బీజేపీతోనే సాధ్యం అవుతుందన్నారు.
