- కొత్త స్థలాలను గుర్తించిన రాజ్ టెక్నాలజీస్ సంస్థ
- కేంద్ర మంత్రి రాంమోహన్ నాయుడుకు వివరాలతో లేఖ రాసిన తుమ్మల
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఎయిర్పోర్ట్కు అడ్డంకులు తొలుగుతున్నాయి. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు కొత్తగూడెం నియోజకవర్గంలోని సీతంపేట, సుజాతనగర్ ప్రాంతాలు అనుకూలమని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.
కొత్త స్థలాలకు సంబంధించిన వివరాలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శనివారం లేఖ రాశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు రిలీజ్ చేశారు. గతంలో రెండు స్థలాలను ప్రతిపాదించగా, ఒకటి సాంకేతికంగా, మరొకటి ఆర్థికంగా అనుకూలం కాదని తేలడంతో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు ముందుకు సాగలేదన్నారు.
ఈక్రమంలో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సూచనలతో స్వతంత్ర సాంకేతిక సంస్థ రాజ్ టెక్నాలజీస్తో రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేయించింది. ఈ సంస్థ సీతంపేట, సుజాతనగర్ ప్రాంతాలను గుర్తించింది. ఏటీఆర్–72,600 తరహా విమానాలకు అనుగుణంగా ఎయిర్పోర్ట్ను డెవలప్ చేసే లక్ష్యంతో జిల్లాలోని ఆరు ప్రాంతాల్లో భూమి లభ్యత, భూతల స్వరూపం, రన్వే, దిశ, ఎత్తు పరిమితి. ఉపరితలాలు, పర్యావరణ అంశాలు, రవాణా సౌకర్యాలను రాజ్ టెక్నాలజీస్ సంస్థ సమగ్రంగా అధ్యయనం చేసిందని మంత్రి తెలిపారు. సీతంపేట, సుజాతనగర్ ప్రాంతాల్లోని 667 ఎకరాల్లో ప్రతిపాదిత స్థలాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తరపున నివేదికను అందజేశామని తెలిపారు. ఎయిర్పోర్ట్ ఏర్పాటుతో భద్రాచలం సీతారామచంద్రస్వామి టెంపుల్, పర్యాటకం, పరిశ్రమలు మరింత అభివృద్ధి చెందుతాయని మంత్రి పేర్కొన్నారు.
