న్యూఢిల్లీ: దేశంలో బిజినెస్ను మరింత విస్తరించేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 8వేల కోట్లను క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా కేటాయిస్తున్నట్టు టాటా స్టీల్ సీఈఓ టీవీ నరేంద్రన్ ప్రకటించారు. కళింగనగర్ ప్లాంట్ (ఒడిశా) విస్తరణ, మైనింగ్ కార్యకలాపాల విస్తరణ, రీసైక్లింగ్ వ్యాపారాన్ని పూర్తి చేయడానికి ఈ డబ్బు ఖర్చు పెడతారు. యూరప్ బిజినెస్ బలోపేతం చేయడానికి, ప్రొడక్ట్ మిక్సింగ్ కోసం ఖర్చు పెట్టే రూ. 3 వేల కోట్లకు ఇది అదనం. "కళింగనగర్ ప్లాంటును భారీగా విస్తరిస్తాం. రా మెటీరియల్ కోసం భారీగా ఖర్చు చేస్తాం. ఈ రెండింటికి రూ. 8వేల కోట్ల క్యాపెక్స్ అవసరం " అని నరేంద్రన్ చెప్పారు. టాటా స్టీల్ కళింగనగర్ ప్లాంట్ సామర్థ్యాన్ని సంవత్సరానికి ఐదు మిలియన్ టన్నులు (ఎంటీపీఏ) నుంచి ఎనిమిది ఎంటీపీఏ కి విస్తరించే పనిలో ఉంది. యూరప్ కార్యకలాపాల కోసం రూ. 3వేల కోట్ల క్యాపెక్స్ను కేటాయించినట్టు టాటా స్టీల్ ఇటీవలే ప్రకటించింది. టాటా స్టీల్ రీసైక్లింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ఈ క్యాపెక్స్లో కొంత ఉపయోగిస్తామని వెల్లడించారు. స్క్రాప్ ఎక్కువగా పశ్చిమ, దక్షిణ ప్రాంతాలలో ఉన్నందున ఆయా రాష్ట్రాలవైపు చూస్తున్నామని నరేంద్రన్ చెప్పారు.ఈ రాష్ట్రాల్లోనే ప్లాంటు ఏర్పాటవుతుందని వెల్లడించారు. తమ మొదటి స్టీల్ రీసైక్లింగ్ ప్లాంట్ను హర్యానాలోని రోహ్తక్లో ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.
