హైదరాబాద్, వెలుగు:అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలను ఆగస్టు 3వ తేదీ నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వర్షాకాల సమావేశాలను గత సెషన్కు కొనసాగింపుగానే నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎనిమిదో సెషన్ఐదో మీటింగ్, కౌన్సిల్18వ సెషన్ఐదో మీటింగ్ఆగస్టు మూడో తేదీన ప్రారంభమవుతుందని అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఉదయం 11.30 గంటలకు ఉభయ సభల సమావేశాలు ప్రారంభమవుతాయని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు కంటోన్మెంట్ఎమ్మెల్యే సాయన్న మృతికి సభ సంతాపం ప్రకటిస్తుంది. ఆ తర్వాత స్పీకర్ అధ్యక్షతన అసెంబ్లీ బీఏసీ, కౌన్సిల్లో చైర్మన్ అధ్యక్షతన కౌన్సిల్బీఏసీ సమావేశాలు నిర్వహించి సభ ఎన్ని రోజులు నడపాలి, ఏయే అంశాలపై చర్చించాలని నిర్ణయిస్తారు. కనీసం ఐదు నుంచి ఏడు పనిదినాలు అసెంబ్లీ నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తున్నది. రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది డిసెంబర్లోనే ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలకు ముందు చివరి సెషన్ కావడంతో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలుస్తున్నది.
రెండేండ్లుగా ప్రొరోగ్చేస్తలే..
అసెంబ్లీ, కౌన్సిల్సమావేశాలను రెండేండ్లుగా ప్రొరోగ్ చేయకుండానే కొనసాగిస్తున్నారు. 2021 సెప్టెంబర్24 నుంచి అక్టోబర్ఎనిమిదో తేదీ వరకు ఏడు రోజుల పాటు తెలంగాణ రెండో అసెంబ్లీ ఎనిమిదో సెషన్నిర్వహించారు. దానికి కొనసాగింపుగానే 2022 మార్చి ఏడో తేదీ నుంచి 15 వరకు ఏడు రోజుల పాటు బడ్జెట్సెషన్నిర్వహించారు. అదే ఏడాది సెప్టెంబర్ఆరో తేదీ నుంచి 13 వరకు మూడు రోజుల పాటు వర్షాకాల సమావేశాలు నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాలుగో తేదీ నుంచి 12 వరకు ఏడు రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగానే అసెంబ్లీని సమావేశపరుస్తున్నారు. 2022 బడ్జెట్సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం కూడా లేదు. ఈ ఏడాది అనేక తర్జనభర్జనల తర్వాత గవర్నర్ప్రసంగం పెట్టి, ధన్యవాదాలు తెలిపారు. కౌన్సిల్18వ సెషన్కు కొనసాగింపుగానే ఇప్పుడు ఐదో సమావేశాలు నిర్వహిస్తున్నారు.