
- జీహెచ్ఎంసీలోని 24 బార్లకు 3,520 అప్లికేషన్లు
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ పరిధిలో 24 బార్లకు, మిగిలిన జిల్లాల్లో నాలుగు బార్లకు జారీ చేసిన దరఖాస్తుల గడువు ముగిసింది. మొత్తం 28 బార్లకు 3,668 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 24 బార్లకు 3,520 దరఖాస్తులు వచ్చాయి. రంగారెడ్డి, మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాలో నాలుగు బార్లకు మొత్తంగా 148 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ద్వారా ఎక్సైజ్ శాఖకు రూ. 36.68 కోట్ల ఆదాయం వచ్చింది. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 బార్లకు వచ్చిన దరఖాస్తులను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్ డ్రా ద్వారా బార్ల యజమానులను ఎంపిక చేయనున్నారు.
రంగారెడ్డి జిల్లా సరూర్నగర్ జల్ పల్లి మున్సిపాలిటీలో బార్లకు 57 దరఖాస్తులు, మహబూబ్గర్ లో 49, నిజామాబాద్ లో 27, నిజామాబాద్ జిల్లా బోధనలో 15 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలోని బార్లకు ఆయా జిల్లా కలెక్టర్లు డ్రా ద్వారా బార్ యజమానులను ఎంపిక చేస్తారు. ఈ నెల 13న బార్లకు డ్రా పద్ధతి ద్వారా బార్ హోల్డర్ ని ఎంపిక చేయడం జరుగుతుందని, డ్రా ఎక్కడెక్కడ అనే విషయం ఒకటి రెండు రోజుల్లో తెలియజేస్తామని రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ దశరథ్ వెల్లడించారు.