పట్టా భూమిని ఫారెస్ట్ ల్యాండ్ గా ఎక్కించారు!

పట్టా భూమిని ఫారెస్ట్ ల్యాండ్ గా ఎక్కించారు!
  • రైతు బంధు, రైతు బీమాకు దూరమై ఎనిమిదేండ్లుగా గోస పడుతున్నాం
  • సెక్రటేరియట్ వద్ద మహబూబాబాద్ జిల్లా నారాయణపురం రైతుల ఆందోళన 

నెల్లికుదురు (కేసముద్రం), వెలుగు: భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా పట్టా భూమిని.. ఫారెస్ట్ ల్యాండ్ గా నమోదు చేయడంతో  ఎనిమిదేండ్లుగా  పోరాడుతున్నామని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వారసత్వంగా భూమిని సాగు చేసుకుంటుండగా.. రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంతో అటవీ భూమిగా రికార్డుల్లోకి ఎక్కించి రోడ్డున పడేశారని మండిపడ్డారు. పట్టా పాసు పుస్తకాల కోసం ఏండ్లుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నామని, రైతు బంధు, రైతు బీమా పొందలేకపోతున్నామని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం రైతులు ఆవేదనతో చెప్పారు. సోమవారం హైదరాబాద్ లోని సెక్రటేరియట్ వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు.

 ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. కొత్త రెవెన్యూ గ్రామంగా ఏర్పడిన సమయంలో , భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా తమ భూములు సర్వే నం.43లోని 1,827 ఎకరాల్లో 222 ఎకరాలు పట్టా, మిగతా1,605 ఎకరాలు రిజర్వ్ ఫారెస్టుగా నమోదు చేసి, పాత పట్టాలను కూడా రద్దు చేశారని చెప్పారు. అటవీశాఖ కూడా క్లియరెన్స్, సీసీఎల్ ఏకు కలెక్టర్లు నివేదికలు పంపినా సరిచేయలేదని తెలిపారు. ధరణిలో తమ పేర్లు నమోదు చేయాలని నిరాహారదీక్ష కూడా చేశామని చెప్పారు. 

  ధరణిలో రైతు పేరు అడవి, తండ్రి పేరు అడవిగా పేర్కొన్నారని రైతులు అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 700 ఎకరాలకు కొత్త పాసు బుక్ లు ఇచ్చారని,  మిగతా భూమికి పెండింగ్ లో పెట్టారని తెలిపారు.  ఇప్పటికే 1,827 ఎకరాలకు రైతు బంధు,రైతు బీమా, పీఎం కిసాన్ యోజన కింద రూ.కోట్లు నష్టపోయామని రైతులు వాపోయారు.  గత ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని, ఇప్పటికైనా సర్వే నివేదిక ప్రకారం పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. మాజీ ఎంపీటీసీ సభ్యుడు రవి నాయక్, గ్రామ రైతులు పాల్గొన్నారు.