ఈ ఏడాది 4 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు

ఈ ఏడాది 4 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు
  • రెండు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక  
  • ఒక్కో స్కూల్​కు రూ.12 కోట్లు ఖర్చు చేయనున్న సర్కార్  
  • స్టూడెంట్లకు ఫ్రీ టాన్స్ పోర్టు సహా టిఫిన్, లంచ్, స్నాక్స్ 
  • వచ్చేనెలలో ప్రారంభానికి విద్యాశాఖ ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు:  విద్యా రంగంలో విప్లవాత్మక మార్పుల దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసుల మేరకు ఈ విద్యా సంవత్సరంలోనే తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రారంభించనున్నది. పైలెట్ ప్రాజెక్టు కింద రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో నాలుగు స్కూళ్లను స్టార్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. వచ్చేనెలలో ఈ స్కూళ్లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 

దీనికి అనుగుణంగా తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి పలు సిఫారసులు చేసింది. నర్సరీ నుంచి ఇంటర్ వరకూ తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు(టీపీఎస్), నర్సరీ నుంచి రెండో తరగతి వరకూ తెలంగాణ ఫౌండేషనల్ స్కూళ్లు (టీఎఫ్ఎస్) ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపించింది. మండలానికి మూడు టీపీఎస్​లు, నాలుగు టీఎఫ్ఎస్​లు ఉండాలని సూచించింది. ఈ స్కూళ్లను ఈ 2025–26 సంవత్సరం నుంచే ప్రారంభించాలని ప్రపోజ్ చేసింది. ఈ స్కూళ్ల ఏర్పాటుపై ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డితో తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సమావేశమై చర్చించారు. ఈ క్రమంలో పైలెట్ ప్రాజెక్ట్ కింద నాలుగు స్కూళ్లను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.  

2 జిల్లాల్లోని 4 మండలాల్లో..  

రంగారెడ్డి జిల్లాలో మంచాల, ఆరుట్లలో, నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు, పొల్కంపల్లిలో టీపీఎస్​లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నెలాఖరులో ముందుగా ఆరుట్లలో ప్రారంభించనున్నారు. ఆ తర్వాత వచ్చేనెలలో మిగిలిన మూడు బడులను స్టార్ట్ చేయనున్నారు. ఆరుట్ల, వంగూరులో నర్సరీ నుంచి ఇంటర్ వరకూ.. మంచాల, పొల్కంపల్లిలో నర్సరీ నుంచి టెన్త్ వరకూ క్లాసులు కొనసాగించనున్నారు. అయితే, ఆయా స్కూళ్ల పరిధిలోని మిగిలిన స్కూళ్లను వీటిలో క్లబ్ చేయనున్నారు. ఒక్కో స్కూల్​కు రూ.12 కోట్లు ఖర్చు చేయనున్నారు.  

ఫ్రీ టాన్స్​పోర్టు, టిఫిన్, లంచ్..  

ఒక్కో తెలంగాణ పబ్లిక్ స్కూల్​లో 1,500 నుంచి 1,800 మంది విద్యార్థులకు అవకాశం కల్పించనున్నారు. టీపీఎస్ లో చదివే విద్యార్థులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, ఈవెనింగ్ స్నాక్స్ అందించనున్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని, చదువుపై శ్రద్ధను పెంపొందించేలా మెనూ రూపొందించనున్నారు. ఈ స్కూళ్లు పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యను సులభతరం చేయడంతో పాటు వారి ఆర్థిక భారాన్ని తగ్గిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. మరోపక్క విద్యార్థులకు ఉచిత రవాణా సదుపాయం కల్పించనున్నది. దీనికోసం ప్రత్యేకంగా మినీ బస్సులను ఏర్పాటు చేయాలని సర్కారు భావిస్తోంది. ఈ స్కూళ్లలో ఆధునిక డిజిటల్ క్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, కంప్యూటర్ ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, సైన్స్ ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, విశాలమైన లైబ్రరీలు, క్రీడా మైదానాలు, ఇండోర్ గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి సౌలతులు కల్పించనున్నారు.