- కూల్చిన చోటే ప్రజాదర్బార్ నిర్వహించాలి
- నిజనిర్ధారణ కమిటీ చైర్మన్, రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్
- వెలుగుమట్ల బాధితులను కలిసిన కమిటీ సభ్యులు
ఖమ్మం టౌన్, వెలుగు : వెలుగుమట్ల బాధితులందరికీ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని నిజనిర్ధారణ కమిటీ చైర్మన్, రిటైర్డ్జడ్జి చంద్రకుమార్ డిమాండ్ చేశారు. అర్హులను గుర్తించడంలో ఆఫీసర్లు వాస్తవాలను మాత్రమే పరిశీలించాలని, పాలకుల మాటలు విని అన్యాయం చేయొద్దని సూచించారు. ఖమ్మంలోని పూలే అధ్యయన వేదికలో బుధవారం వెలుగుమట్ల బాధితులతో మాట్లాడారు.
అనంతరం ఖమ్మం కలెక్టరేట్లో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డితో సమావేశమయ్యారు. అసలు భూదాన్ భూమి ఎంత ? ఇండ్లు కూల్చివేతకు ఎలాంటి అనుమతులున్నాయి, ఏ ప్రమాణాల మేరకు ఇండ్లు కోల్పోయిన వారిలో అర్హులను గుర్తించారు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం చంద్రకుమార్ మాట్లాడుతూ... అర్హులెవరైనా ఉంటే పూర్తి ఆధారాలతో నిజానిర్దారణ కమిటీకి వివరాలు పంపించాలని సూచించారు.
బాధితుల పిల్లలకు గురుకులాల్లో సీట్లు కేటాయించేలా చూస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారన్నారు. కలెక్టరేట్తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. మంత్రుల ఫామ్హౌజ్లను పట్టించుకోకుండా పేదల ఇండ్లు కూల్చడం దుర్మార్గం అన్నారు. బాధితుల కుటుంబంలో ఎవరి పేరు మీదైనా ఇల్లు, భూమి ఉంటే వారిని అనర్హులుగా తేల్చడం సరికాదని, వారి ఆర్థిక పరిస్థితిని మాత్రమే చూడాలన్నారు.
ఇండ్లు కూల్చేసిన చోటే ప్రజాదర్బార్ నిర్వహించి మొత్తం 750 మందిని అర్హులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అర్హులందరికీ ఇండ్లు ఇవ్వకపోతే ప్రజా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, ఆర్మీ మాజీ మేజర్ మదన్మోహన్, ప్రొఫెసర్లు అనురాధ, నాగం కుమారస్వామి, రామయ్య, న్యాయవాదులు సుంకర నరేశ్, శ్రావణ్గౌడ్, నూర్జహాన్ పాల్గొన్నారు.
