
- అపార్ట్ మెంట్ ఫ్లాట్స్, టవర్లు, ఖాళీ స్థలాల ఆక్షన్
- బండ్లగూడ, పోచారం, గాజుల రామారంలో టవర్లు
- లాటరీ ద్వారా ట్రిపుల్, డబుల్, సింగిల్ బెడ్ రూం ఫ్లాట్ల అమ్మకం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా రాజీవ్ స్వగృహ టవర్లు, హౌసింగ్ బోర్డు ఫ్లాట్ల వేలానికి ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రాజీవ్ స్వగృహలో అపార్ట్ మెంట్ టవర్లు, పూర్తయిన, అసంపూర్తిగా మిగిలిన ఫ్లాట్లు ఉండగా, హౌసింగ్ బోర్డుకు సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డితో పాటు జిల్లాల్లో ఫ్లాట్లు ఉన్నాయి. రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో పలు జిల్లాల్లోని 11 ప్రాంతాల్లో ఇప్పటికే పూర్తయిన, పాక్షికంగా పూర్తయిన ఫ్లాట్లతో పాటు ఖాళీ స్థలాలను బహిరంగ వేలంలో విక్రయించనున్నారు.
ఎటువంటి వివాదాలు లేని భూములు, అందుబాటులో ఉండే ధరలతో నిర్మించిన అపార్ట్ మెంట్ల -ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఉన్న వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హౌసింగ్ అధికారులు కోరుతున్నారు. కాగా.. రాజీవ్ స్వగృహకు సంబంధించినంత వరకు గాజుల రామారం, పోచారంలో అసంపూర్తిగా టవర్లు ఉన్నాయి. బండ్లగూడ, పోచారంలో ట్రిపుల్ బెడ్ రూమ్ డీలక్స్, ట్రిపుల్ బెడ్ రూమ్, డబుల్ బెడ్ రూమ్, సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు ఉన్నాయి.
పోచారంలో 2 టవర్లు ఉండగా ఒక టవర్ లో 122 ప్లాట్లకు (ఒక్క ఎస్ఎఫ్ టీ రూ.1,650 చొప్పున రూ.30 కోట్లు, రూ.2 కోట్లు డిపాజిట్), మరో టవర్ లో 72 ప్లాట్లకు (ఒక్క ఎస్ఎఫ్ టీ రూ.1,650 చొప్పున రూ.13.78 కోట్లు రూ.1 కోటి డిపాజిట్) రాజీవ్ స్వగృహ కార్పోరేషన్ ఎండీ వీపీ గౌతమ్ ధరలు ఖరారు చేశారు. గాజుల రామారంలో రెండు టవర్లలో ఒక్కో దాంట్లో 112 చొప్పున 224 ఫ్లాట్లు ఉన్నాయి.
వీటిని గుత్తగా అమ్ముతామని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఒక్క టవర్ లో ఒక్క ఎస్ఎఫ్ టీ రూ.1,995 చొప్పున రూ.26.33 కోట్లుగా ధరలు ఖరారు చేశారు. వీటికి ఒక్కో టవర్ కు రూ.2 కోట్లు డిపాజిట్ గా చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే నెల 19 వరకు డిపాజిట్ చెల్లించాలని, 20న లాటరీ తీస్తామని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
హౌసింగ్ బోర్డు స్థలాలు..
కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ (కేపీహెచ్బీ)- 4 వ ఫేజ్లో ఖాళీగా ఉన్న ఉన్న రెండు ఓపెన్ ప్లాట్లును(4,598 గజాలు, 2,420 గజాలు) ఈ- ఆక్షన్లో విక్రయించనున్నారు. అలాగే, నాంపల్లిలోని 1,148 గజాల ఖాళీ స్థలాన్ని బహిరంగ వేలంలో అమ్మేందుకు అధికారులు శుక్రవారం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నెల 30న వీటిని వేలం వేయనున్నారు.