పరిటాల రవికి భయపడి గద్దర్ దగ్గరకు వచ్చిన పవన్ కల్యాణ్ : పాశం యాదగిరి

పరిటాల రవికి భయపడి గద్దర్ దగ్గరకు వచ్చిన పవన్ కల్యాణ్ : పాశం యాదగిరి

జనసేన అధినేత, ఏపీ  డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తెలంగాణ సీనియర్ జర్నలిస్ట్, ఉద్యమకారుడు పాశం యాదగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు.  గతంలో దివంగత నేత పరిటాల రవి చేసిన దాడి నుంచి తనను తాను తప్పించుకోవడానికే.. పవన్ కళ్యాణ్ ఒక పెద్ద నాటకానికి తెరలేపారని పాశం యాదగిరి తీవ్ర ఆరోపణలు చేశారు. పరిటాల రవి భయంతోనే.. పవన్ కళ్యాణ్ తన ఇంటి నిండా, తన డ్రెస్సుల మీద చేగువేరా, ఫిడేల్ కాస్ట్రో బొమ్మలు వేసుకొని  గద్దర్‌ను నమ్మించి పెద్ద డ్రామా ఆడారని  సెటైర్ వేశారు.

అంతేకాదు1997లో గద్దర్‌పై ప్రాణాంతక దాడి చేయించింది మరెవరో కాదు.. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబేనని ఆయన ఆరోపించారు.  నాడు గద్దర్‌పై దాడి చేయించిన చంద్రబాబుతో ఇవాళ పవన్ కళ్యాణ్ చేతులు కలపడం ఏంటని ఆయన ప్రశ్నించారు.

ఇటీవల ప్రెస్ మీట్‌లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను పాశం యాదగిరి పూర్తిగా ఖండించారు. తనకు గద్దర్ అంటే ఎంతో ఇష్టమని, గద్దర్‌కు తానే ఒక కారు కొనిచ్చానంటూ పవన్ కళ్యాణ్ అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు. గద్దర్‌కు 2006 నుంచే సొంతంగా ఇన్నోవా కారు ఉందని.. పవన్ కళ్యాణ్ ఇదంతా అబద్ధపు ప్రచారమే చేస్తున్నారని తేల్చి చెప్పారు.

ఇటీవల గద్దర్ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా.. పాశం యాదగిరి బయటపెట్టిన ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .