పనుల వివరాల అప్​లోడ్​లో మనమే టాప్ .. జలశక్తి అభియాన్ పోర్టల్​లో వేగంగా వివరాలు నమోదు

పనుల వివరాల అప్​లోడ్​లో మనమే టాప్ .. జలశక్తి అభియాన్ పోర్టల్​లో వేగంగా వివరాలు నమోదు
  • సెకండ్, థర్డ్​ ప్లేసులో చత్తీస్​గఢ్, రాజస్థాన్​
  •  దేశంలోనే ఆదిలాబాద్​కు ఐదో స్థానం, రాష్ట్రంలో మొదటి ప్లేస్

హైదరాబాద్, వెలుగు: జలశక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్’ (నీటి సంరక్షణ) కార్యక్రమంలో భాగంగా కేంద్రం ఏడు రకాల పనులు చేపట్టింది. ఉపాధి పథకంలో భాగంగా చెక్ డ్యామ్‌‌‌‌లు, పెర్కోలేషన్ ట్యాంకులు, కుంటలు, ఇంకుడు గుంతలు, ఇరిగేషన్ ట్యాంకులు, పూడిక తొలగింపు, భూగర్భజలాల రీచార్జ్, వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా రీచార్జ్ పిట్స్, బోర్‌‌‌‌వెల్ రీచార్జ్, ఫామ్​ పాండ్స్ పనులు చేపట్టారు.  ఈ పనులకు సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు అప్​లోడ్​ చేయాలని కేంద్రం జలశక్తి అభియాన్ ​పోర్టల్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో దేశవ్యాప్తంగా పనుల వివరాల నమోదులో తెలంగాణ టాప్​లో నిలిచింది. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్రం  శనివారం వెల్లడించింది.

 తెలంగాణ 4,44,253 పనుల వివరాలు అప్​లోడ్​ చేసి నంబర్​ వన్​ స్థానంలో నిలవగా.. రెండో స్థానంలో చత్తీస్​గఢ్​ రాష్ట్రం 4,28,734 , థర్డ్​ ప్లేస్​లో  రాజస్థాన్​ 4,09,135 పనులు అప్​లోడ్​ చేసింది. శనివారంతో పనుల వివరాలు అప్​లోడ్​ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలో టాప్​ వన్​లో ఆదిలాబాద్​ జిల్లా 70,499 పనులు, ద్వితీయ స్థానంలో  నల్గొండ 63,737, మంచిర్యాల 60,610  పనుల అప్​లోడింగ్​తో తృతీయ స్థానంలో నిలిచింది. కాగా, టాప్​ వన్​ ప్లేస్​ లో నిలిచిన రాష్ట్రానికి కేంద్రం రూ.2 కోట్లు ప్రోత్సాహకం అందించనున్నది. అయితే, నీటి సంరక్షణ కోసం చేపట్టిన పనుల వివరాలు నమోదులో తెలంగాణ వెనుకబాటులో ఉండేది. 

పీఆర్, ఆర్డీ డైరెక్టర్​ సృజన ప్రత్యేక దృష్టి సారించారు. మొదట్లో 50   వేల పనులు మాత్రమే అప్​లోడ్​ కాగా జిల్లా కలెక్టర్లు, డీఆర్​డీవోలతో మాట్లాడి పనుల  వివరాల నమోదుకు చొరవ తీసుకోవాలని కోరారు. దీనిపై తరచూ వీడియో కాన్ఫరెన్స్​లు నిర్వహించడం, ఈ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో టాప్​ వన్​ స్థానానికి చేరింది. ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్‌‌‌‌లు, పెర్కోలేషన్ ట్యాంకులు, ఫామ్​పాండ్స్ తదితర పనుల వివరాల నమోదుకు కృషి చేసిన అధికారులకు డైరెక్టర్​ అభినందనలు తెలిపారు.