
ములకలపల్లి, వెలుగు : మండలంలోని మంగపేటలో ఆదివారం రోడ్డుపై యూరియా తిని పది మేకలు మృతి చెందాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రోజు మాదిరిగానే గ్రామానికి చెందిన వాడే దారయ్య తన మేకలతో పాటు గ్రామంలోని పలువురికి చెందిన మేకలను మేత కోసం సమీప బీళ్లకు తోలుకెళ్లాడు.
ఈ క్రమంలో రోడ్డుపై ఓ రైతుకు వరి నారుమడిలో చల్లేందుకు ట్రాక్టర్ పై యూరియా బస్తా తీసుకెళ్తుండగా అది కాస్త పగిలి రోడ్డుపై యూరియా అక్కడక్కడ పడిపోయింది. అటుగా వచ్చిన మేకలు రోడ్డుపై పడిపోయిన యూరియాను తిన్నాయి. దాంతో 10 మేకలు మృతి చెందాయి. వాటి విలువ సుమారు లక్షన్నర ఉంటుందని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.