బిజినెస్డెస్క్, వెలుగు: స్టాక్ మార్కెట్లో బుల్స్ గురువారం చెలరేగిపోయాయి. ఈ ఏడాది నవంబర్ నుంచి నెలవారి బాండ్ కొనుగోళ్లను తగ్గించడం ప్రారంభిస్తామని యూఎస్ ఫెడ్ ప్రకటించినప్పటికీ, బుల్స్ మాత్రం ఆగలేదు. మొత్తం బ్రాడ్ మార్కెట్లో కొనుగోళ్లు పెరిగాయి. రియల్టీ ఇండెక్స్ ఏకంగా 9 శాతం పెరిగింది. మార్టగేజ్ బిజినెస్లో ఉన్న ఫైనాన్షియల్ కంపెనీల షేర్లు కూడా ఎగిశాయి. చైనీస్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఎవర్గ్రాండ్ బాండ్ పేమెంట్లను చేయడంలో డీఫాల్ట్ అయినా, ఎకానమీపై పెద్ద ఎఫెక్ట్ లేకుండా ఉండేందుకు చైనీస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గత కొన్ని రోజుల్లోనే మొత్తం 17 బిలియన్ డాలర్లను ఎకానమీలోకి పంప్ చేసింది. ఈ అంశాలు దేశ స్టాక్ ఇండెక్స్లు పెరగడానికి కారణమయ్యియి. అంతేకాకుండా ఎవర్గ్రాండ్ కూడా డొమెస్టిక్ బాండ్లపై బకాయిలను గురువారం పే చేయగలిగింది. కానీ, డాలర్ బాండ్లపై బకాయిలను పే చేయాల్సి ఉంది. డాలర్ మారకంలో రూపాయి విలువ గత కొన్ని సెషన్ల నుంచి బలపడుతుండడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పెరుగుతోంది. బెంచ్మార్క్ ఇండెక్స్లు గురువారం కొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 59,957.25 వద్ద ఆల్టైమ్ హైని నమోదు చేసింది. కీలకమైన 60 వేల స్థాయికి 43 పాయింట్లు దూరంలో ఈ ఆల్టైమ్ హైని నమోదు చేయగలిగింది. సెన్సెక్స్ చివరికి 958 పాయింట్లు (1.63 శాతం) లాభపడి 59,885 వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ కూడా కీలకమైన 18,000 స్థాయి చేరువకు వచ్చింది. ఇంట్రాడేలో ఈ ఇండెక్స్ 17,843.90 వద్ద ఆల్టైమ్ హైని టచ్ చేయగలిగింది. నిఫ్టీ చివరికి 276 పాయింట్లు (1.57 శాతం) పెరిగి 17,823 వద్ద క్లోజయ్యింది.
బ్రాడ్ మార్కెట్ పైకి..
బ్రాడ్ మార్కెట్ పరంగా చూస్తే ఎక్కువ షేర్లు గ్రీన్లో క్లోజయ్యాయి. నిఫ్టీలో బజాజ్ ఫిన్సర్వ్, హిందాల్కో, ఎల్ అండ్ టీ, టాటా మోటార్స్, కోల్ ఇండియా షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. హెచ్డీఎఫ్సీ లైఫ్, డా. రెడ్డీస్, జేఎస్డబ్ల్యూ, టాటా కన్జూమర్స్, ఐటీసీ షేర్లు నష్టపోయాయి. సెక్టార్ల పరంగా చూస్తే నిఫ్టీ రియల్టీ, బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్లు ఎగిశాయి. నిఫ్టీ మీడియా (1.71 శాతం డౌన్) తప్ప మిగిలిన ఇండెక్స్లు పాజిటివ్గా ముగియగలిగాయి. బుధవారం సెషన్లో 35 శాతం వరకు పెరిగిన జీ ఎంటర్టైన్మెంట్ షేరులో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో ఈ షేరు గురువారం 5 శాతం మేర పడింది. బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 261.71 లక్షల కోట్లను టచ్ చేసింది. ఎన్ఎస్ఈలో లిస్టయిన కంపెనీల్లో 1,974 షేర్లు లాభాల్లో ముగియగా, 1,266 షేర్లు నష్టాల్లో ముగిశాయి. షాంఘై, హాంకాంగ్ మార్కెట్లు లాభాల్లో క్లోజవ్వగా, సియోల్ మార్కెట్ నెగెటివ్లో ముగిసింది. హాలిడే కావడంతో జపనీస్ మార్కెట్ ఓపెన్ కాలేదు. యూరప్ స్టాక్ ఎక్స్చేంజిలు పాజిటివ్గా ట్రేడయ్యాయి. బ్రెంట్ క్రూడాయిల్ 0.12 శాతం తగ్గి బ్యారెల్ 76.10 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్ మారకంలో రూపాయి విలువ 23 పైసలు బలపడి 73.64 వద్ద సెటిలయ్యింది.
కీలక లెవెల్స్ ఇక ఈజీగా..
నిఫ్టీ రేంజ్ నుంచి బ్రేక్ అవుట్ అయ్యిందని, ఈ లెవెల్స్లో సస్టయిన్ అవ్వగలిగితే 18,000 మార్క్ ను ఈజీగా క్రాస్ చేస్తుందని ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ ఎనలిస్ట్ రోహిత్ సింగ్రే పేర్కొన్నారు. నిఫ్టీకి 17,770–17,700 స్థాయిల్లో సపోర్ట్ ఉందని, ఈ లెవెల్స్కు పడిపోతే వెంటనే బయ్యింగ్ వస్తుందని చెప్పారు. పైన 17,900–18,000 స్థాయిలు రెసిస్టెన్స్గా పనిచేస్తాయని అంచనావేశారు. గ్లోబల్ మార్కెట్ల పెర్ఫార్మెన్స్ను జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉందని స్వస్తికా ఇన్వెస్టమార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా చెప్పారు. గ్లోబల్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి లేకపోతే మన మార్కెట్లు కీలక స్థాయిలను ఈజీగా క్రాస్ చేస్తాయని అభిప్రాయపడ్డారు. నిఫ్టీ 18,000, సెన్సెక్స్ 60 వేలు ఇన్వెస్టర్లలో సైకలాజికల్ రెసిస్టెన్స్లుగా పనిచేయొచ్చని పేర్కొన్నారు.