వికారాబాద్, వెలుగు : వికారాబాద్ జిల్లాలో ఇల్లు అమ్మనివ్వడం లేదని తండ్రి గొంతు కోశాడో కొడుకు. కోటిపల్లి ఎస్ఐ స్రవంతి కథనం ప్రకారం..మండలంలోని బీరోలు గ్రామానికి చెందిన తాండ్ర అంతయ్య కొడుకు రమేశ్ తాగుడుకు బానిసగా మారాడు. తండ్రి పేరిట ఉన్న భూమినంతా అమ్ముకున్నాడు. కొంతకాలం కింద తండ్రి అంతయ్య పక్షవాతంతో మంచాన పడ్డాడు. దీంతో తాగేందుకు డబ్బులు లేకపోవడంతో రమేశ్ ఇల్లు అమ్మేందుకు ప్రయత్నించాడు.
తండ్రి ఎంత నచ్చజెప్పినా వినిపించుకోలేదు. తండ్రిని చంపితేనే ఇల్లు అమ్ముకోవచ్చని భావించిన రమేశ్ సోమవారం మంచంపై ఉన్న తండ్రి అంతయ్య గొంతును కత్తితో కోశాడు. అంతయ్య కేకలు వేయగా ఇరుగు పొరుగు వారు వచ్చేసరికి పారిపోయాడు. రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అంతయ్యను వికారాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ దవాఖానకు తీసుకువెళ్లారు. రమేశ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు.