మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్​ హాస్టల్​లో విద్యార్థి మృతి

మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్​ హాస్టల్​లో విద్యార్థి మృతి

సూర్యాపేట, వెలుగు: హాస్టల్​లో వాటర్ సంపు గోడ కూలి ఓ స్టూడెంట్​ మృతిచెందాడు. సూర్యాపేట జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్​ హాస్టల్​లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. నాగారం మండలానికి చెందిన హాస్టల్​ను చివ్వెంల మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ బిల్డింగ్​లో నిర్వహిస్తున్నారు. గురువారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో ఆర్.పవన్ (13), కె.యశ్వంత్, జె.సుశాంత్ అనే ముగ్గురు ఐదో తరగతి స్టూడెంట్స్​ పాఠశాల ఆవరణలోని వాటర్ ట్యాంక్ వద్ద స్నానాలు చేస్తుండగా ఒక్కసారిగా గోడ కూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్టూడెంట్స్​కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని సూర్యాపేట ప్రభుత్వ జనరల్​ హాస్పిటల్ కు తరలించారు. ట్రీట్​మెంట్​ పొందుతూ పవన్​మృతిచెందాడు. యశ్వంత్ పరిస్థితి క్రిటికల్​గా ఉండడంతో హైదరాబాద్​కు తరలించారు. పవన్ ది మోతె మండలం అప్పన్నగూడెం అని అధికారులు తెలిపారు.  

రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి 
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని

మృతిచెందిన పవన్ కుటుంబ సభ్యులకు రూ.50లక్షల ఎక్స్​గ్రేషియా ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హాస్పిటల్​లో ట్రీట్మెంట్ పొందుతున్న స్టూడెంట్స్​ను ఆయన పరామర్శించి మీడియాతో మాట్లాడారు. చనిపోయిన స్టూడెంట్​ కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగమివ్వాలని డిమాండ్​ చేశారు. తొమ్మిదేండ్లు గడుస్తున్నా నేటికీ ప్రభుత్వ హాస్టళ్లకు సొంత భవనాలు ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు.


పవన్​ కుటుంబానికి రూ.2  లక్షల ఆర్థిక సాయం

ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రి  జగదీశ్​రెడ్డి ఆసుపత్రికి చేరుకొని చనిపోయిన స్టూడెంట్​ కుటుంబ సభ్యులను పరామర్శించారు. గాయపడిన స్టూడెంట్స్​కు మెరుగైన ట్రీట్​మెంట్​ అందించాలని డాక్టర్లకు సూచించారు. పవన్ కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. అలాగే, డబుల్​ బెడ్రూం ఇల్లుతో పాటు కుటుంబం లో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం, మృతుడి సోదరికి గురుకుల పాఠశాలలో చదువుకొనే అవకాశం కల్పిస్తామన్నారు. గాయపడిన స్టూడెంట్స్​కు ప్రభుత్వ ఖర్చులతో వైద్యం అందిస్తామని తెలిపారు. ఘటన పై విచారణ జరుపాలని కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు.