
- మరో నలుగురు పిల్లలకు అస్వస్థత
- జ్వరం టానిక్ తాగడం వల్లే అంటున్న పేరెంట్స్
- మెదక్ జిల్లా అల్లాదుర్గంలో ఘటన
అల్లాదుర్గం, వెలుగు : అనుమానాస్పదస్థితిలో చిన్నారి మృతి చెందగా, మరో నలుగురు చిన్నారులు అస్వస్థతకు గురైన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. తల్లిదండ్రులు, బంధువులు తెలిపిన ప్రకారం.. అల్లాదుర్గం గ్రామానికి చెందిన సిద్ధప్ప, సాయమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కొద్ది రోజులుగా పిల్లలకు జ్వరం వస్తుండగా రెండు రోజుల కింద అల్లాదుర్గం పీహెచ్ సీలో చూపించగా.. పారాసెటిమల్ జ్వరం టానిక్ ఇవ్వగా తీసుకొచ్చారు. శుక్రవారం జ్వరం టానిక్ పిల్లలకు తల్లి సాయమ్మ తాగించింది.
కొద్దిసేపటికి అస్వస్థతకు గురికాగా, వీరిలో చిన్నారి ప్రియా(5) అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. మిగతా నలుగురు రేణుక(9), శ్రీను(8), ఐశ్వర్య (6), గణేష్(3) జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. దంపతుల మధ్య గొడవల కారణంగా పిల్లలకు టానిక్ లో ఏదైనా విషపూరిత రసాయనం కలిపి ఉండొచ్చని బంధువులు అనుమానిస్తున్నారు. చిన్నారుల తల్లి సాయమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అల్లాదుర్గం ఎస్ఐ శంకర్ తెలిపారు.
మెదక్ డ్రగ్స్ ఇన్ స్పెక్టర్ ఎంక్వైరీ
చిన్నారి మృతి ఘటనపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ఆదేశాలతో మెదక్ డ్రగ్స్ ఇన్ స్పెక్టర్ చంద్రకళ విచారణ చేపట్టారు. అల్లాదుర్గం పీహెచ్ సీని తనిఖీ చేసి టానిక్ లు, రికార్డులను పరిశీలించారు. చిన్నారి ప్రియాకు తాగించిన జ్వరం టానిక్ బాటిళ్లను స్టేట్ ల్యాబ్ కు పంపించి టెస్టులు చేస్తామని ఆమె తెలిపారు. టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.