తిరుమల వెళ్తున్నారా? మే నెల శ్రీవారి దర్శన టిక్కెట్లు విడుదల.. బుకింగ్ తేదీలు ఇవే..

తిరుమల వెళ్తున్నారా?  మే నెల శ్రీవారి దర్శన టిక్కెట్లు విడుదల.. బుకింగ్ తేదీలు ఇవే..

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈరోజు సోమవారం(ఫిబ్రవరి 16)న  మే 2026 నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, వసతి, సేవల బుకింగ్ ఆన్‌లైన్ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ బుకింగ్ ప్రక్రియ ఫిబ్రవరి 18న ప్రారంభమై ఫిబ్రవరి 27 వరకు TTD అధికారిక  వెబ్‌సైట్ ద్వారా తెరిచి ఉంటుంది.

మే నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనతో సహా అర్జిత సేవా టిక్కెట్ల కోటా ఫిబ్రవరి 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడుతుందని టిటిడి తెలిపింది. ఫిబ్రవరి 20న ఉదయం 10 గంటల వరకు భక్తులు ఎలక్ట్రానిక్ డిప్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. కేటాయించిన టిక్కెట్లు ఫిబ్రవరి 20 నుండి 22 మధ్యాహ్న 12 గంటలలోపు పేమెంట్ పూర్తి చేసి బుకింగ్‌లను కన్ఫర్మ్ చేయాలి. 

 కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకర సేవ టిక్కెట్లు ఫిబ్రవరి 21న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి. వర్చువల్ సేవలు వాటి అనుబంధ దర్శన స్లాట్‌ల కోటా అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులోకి వస్తాయి. అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటా ఫిబ్రవరి 23న ఉదయం 10 గంటలకు, ఆ తర్వాత శ్రీవాణి ట్రస్ట్ దర్శన టిక్కెట్లు ఉదయం 11 గంటలకు విడుదల చేయబడతాయని టిటిడి తెలిపింది. సీనియర్ సిటిజన్లు, వికలాంగులు,  వ్యాధులతో బాధపడుతున్న భక్తులకు ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లు ఫిబ్రవరి 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి.

రూ.300 స్పెషల్ ఎంట్రీ దర్శన టిక్కెట్ల కోటా ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు, తిరుమల ఇంకా తిరుపతిలో గదుల వసతి కోటా అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 2026కి సంబంధించిన శ్రీవారి సేవ, పరకామణి సేవ కోటా ఫిబ్రవరి 27న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. భక్తులు  అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే అర్జిత సేవలు, దర్శన టిక్కెట్లు ఇంకా వసతిని బుక్ చేసుకోవాలని, మధ్యవర్తులపై ఆధారపడొద్దని టిటిడి సూచించింది.