
- తీవ్ర గాయాలతో స్పృహ తప్పిన ఇద్దరు సందర్శకులు
- రాయికల్ వాటర్ ఫాల్ వద్ద ఘటన
సైదాపూర్, వెలుగు : కరీంనగర్ జిల్లా సైదాపూర్మండలం రాయికల్జలపాతం దగ్గర ఇద్దరు సందర్శకులు తేనెతుట్టెపై నీళ్లు చల్లడంతో అవి వెంటపడి దాడి చేశాయి. దీంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడి స్పృహ తప్పి పడిపోయారు. కరీంనగర్కు చెందిన రత్న సంపత్, మన్నెంపల్లి గ్రామానికి చెందిన బహుత్ శ్రీనివాస్ గురువారం వాటర్ఫాల్ చూసేందుకు వచ్చారు. జెండా గుట్టపై వరకు చేరుకున్న తర్వాత అక్కడ చెట్లపై ఉన్న తేనెతుట్టెపై నీళ్లు చల్లడంతో తేనెటీగలు వెంట పడి దాడి చేశాయి.
తీవ్రంగా గాయపడిన ఇద్దరు తప్పించుకునే ప్రయత్నంలో పరుగులు తీయగా వాటర్ఫాల్ బండలపై జారిపడి స్పృహ తప్పి పడిపోయారు. మధ్యాహ్నం వెళ్లిన వారు ఎంతకూ రాకపోవడం, ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్లో ఉండడంతో కుటుంబసభ్యులు రాయికల్ గ్రామస్తులను ఆరా తీశారు. గ్రామస్తులు కొందరు గుట్టలపై గాలించగా కనిపించారు. వారిని పోలీసులు హుజూరాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.