
- భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జగిత్యాల, వనపర్తి జిల్లాలకు కేటాయింపు
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణకు నాలుగు కేంద్రీయ విద్యాలయాల (కేవీ)ను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు బుధవారం (అక్టోబర్ 01) ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం (యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్), ములుగు జిల్లా కేంద్రం (గిరిజన ప్రాంతం), జగిత్యాల జిల్లాలోని చెల్గల్, వనపర్తి జిల్లాలోని నాగవరం శివారులో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 57 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోగా, ఇందులో కేవీలు లేని జిల్లాలకు 20, యాస్పిరేషనల్ జిల్లాలకు 14, నక్సలిజం ప్రభావిత ప్రాంతాలకు నాలుగు,
ఎన్ఈఆర్/పర్వత ప్రాంతాలకు ఐదింటిని
కేటాయించారు.
తెలంగాణలో నాణ్యమైన విద్యకు దోహదం: కిషన్ రెడ్డి
ఇప్పటికే రాష్ట్రంలో 35 కేంద్రీయ విద్యాలయాలు ఉండగా, కొత్తగా 4 కేవీలు కేటాయించడంతో మారుమూల ప్రాంతాల్లోనూ నాణ్యమైన ప్రాథమిక, సెకండరీ విద్యను అందించడంలో ఇవి కీలకం పాత్ర పోషించనున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా, గత రెండేండ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో నాణ్యమైన సెకండరీ విద్య అందించేందుకు రూ.400 కోట్లతో 832 పీఎం-శ్రీ స్కూల్స్ను మంజూరు చేసిందని చెప్పారు.
దేశవ్యాప్తంగా పీఎంశ్రీ స్కూల్స్ కోసం ఎక్కువ కేటాయింపులు అందుకున్న రాష్ట్రం తెలంగాణనే కావడం సంతోషంగా ఉందన్నారు. సమగ్రశిక్షా అభియాన్ కింద గత రెండేండ్లలో తెలంగాణకు దాదాపు రూ.2 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. దాదాపు రూ.వెయ్యి కోట్లతో ములుగు జిల్లాలో సమ్మక్క, సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు
చేసిందని గుర్తుచేశారు.
తెలంగాణలో విద్యాభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కి ఈ సందర్భంగా కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.