బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. ఈ ఇద్దరు ఒకే స్క్రీన్ పై కనిపిస్తే బాక్సాఫీస్ వద్ద సునామీ ఖాయం. ఇప్పుడు ఇదే వార్త ఒకటి సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'స్పై యూనివర్స్'లో భాగంగా రాబోతున్న 'పఠాన్ 2' లో ఎన్టీఆర్ ఒక పవర్ఫుల్ పాత్రలో నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
స్పై యూనివర్స్లో పెను మార్పులు
ఈ ఏడాది హృతిక్ రోషన్తో కలిసి 'వార్ 2' ఎన్టీఆర్ నటించారు. బాలీవుడ్లో తన సత్తా చాటారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. నిజానికి ఎన్టీఆర్ పోషించిన 'ఏజెంట్ విక్రమ్' పాత్రతో ఒక సోలో స్పిన్-ఆఫ్ సినిమా తీయాలని ఆదిత్య చోప్రా తొలుత భావించారు. కానీ, 'వార్ 2' ఫలితాల అనంతరం ఆ ప్లాన్ మార్చుకుని, ఎన్టీఆర్ క్యారెక్టర్ను నేరుగా మెయిన్ స్ట్రీమ్ కథలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే 'పఠాన్ 2'లో షారుఖ్కు ధీటైన పాత్రను ఎన్టీఆర్ కోసం డిజైన్ చేశారట.
హీరోనా? విలనా?
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎన్టీఆర్ పోషించబోయే పాత్రపై రెండు రకాల చర్చలు నడుస్తున్నాయి . వాటిల్లో ఒకటి పఠాన్ (షారుఖ్) తో కలిసి మిషన్ పూర్తి చేసే మరో గూఢచారిగా కనిపిస్తారా? లేదా పఠాన్కే సవాల్ విసిరే అత్యంత తెలివైన, శక్తివంతమైన ప్రతినాయకుడిగాఅలరిస్తారా? అన్న దానిపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఒకవేళ ఎన్టీఆర్ విలన్గా కనిపిస్తే మాత్రం స్క్రీన్ మీద అగ్నిపర్వతం పేలడం ఖాయమని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
షూటింగ్ ఎప్పుడు?
షారుఖ్ ఖాన్ ప్రస్తుతం తన కుమార్తె సుహానా ఖాన్తో కలిసి 'కింగ్' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే, అంటే 2026 ప్రారంభంలో 'పఠాన్ 2' పట్టాలెక్కే అవకాశం ఉంది. స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయ్యిందని, ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని టాక్. ఇక ఈ మెగా మూవీని 2027లో థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే దీనిపై ఇంకా అధికారికంగా మేకర్స్ ప్రకటించాల్సి ఉంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ 'దేవర 2', 'డ్రాగన్' , వార్ 2 చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఒకవేళ 'పఠాన్ 2' కూడా ఖరారైతే, ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు ఎన్టీఆర్ క్రేజ్ ఆకాశాన్ని తాకడం ఖాయం అని అభిమానులు, సినీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
