- బంధువు చనిపోయాడని పరామర్శకు వెళ్లి.. వాగు దాటుతూ..
- నీటి ఉధృతికి వెళ్లలేక సాయం కోసం ఆర్తనాదాలు
- స్పందించి తాడుతో వాగులోకి దిగి రక్షించిన గ్రామస్తులు
- జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం కొండ్రికర్ల వద్ద ఘటన
జగిత్యాల జిల్లా మెట్ పల్లిలోని కొండ్రికర్ల దగ్గర వాగులో చిక్కుకున్నాడు నర్సయ్య అనే వ్యక్తి. తొలుత నెమ్మదిగా కనిపించిన వాగు ప్రవాహం అంతకంతకూ పెరగడంతో కొద్దిదూరం వెళ్లగానే ముందుకెళ్లలేక రెయిలింగ్ పట్టుకుని నిలబడిపోయాడు. వాగు దాటలేకపోతున్నానని.. తనను కాపాడమంటూ ఆర్తనాదాలు చేయగా.. స్థానిక గ్రామస్తులు స్పందించి తాడు సహాయంతో రక్షించారు. సోమవారం ఉదయం జరిగిందీ ఘటన.
గ్రామానికి చెందిన నర్సయ్య అనే వ్యక్తికి తన బంధువు చనిపోయాడన్న సమాచారంతో వాగు దాటేందుకు నీటిలో దిగాడు. అయితే జగ్గసాగర్ వద్ద వరద కాలువ గేట్లు ఎత్తడంతో వాగులో ప్రవాహం క్రమంగా పెరిగింది. దీంతో వాగు నీటి ప్రవాహంలో చిక్కుకుపోయిన నర్సయ్య తనను కాపాడమంటూ ఆర్తనాదాలు చేయగా.. స్థానికులు స్పందించారు. పెద్ద తాడు సహాయంతో నర్సయ్యను చాకచక్యంగా కాపాడారు. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతి వల్ల వాగులో నీటి ప్రవాహం పెరిగిందని స్థానికులు తెలిపారు. మరికొంత సమయం గడచిఉంటే వాగు ఉధృతి పెరిగి కాపాడలేని పరిస్థితి ఉండేది కాదంటూ ఊపిరి పీల్చుకున్నారు.