మూమునూర్​ ఎయిర్​పోర్టుకు భూసేకరణ ఎకరానికి రూ.1.20 కోట్లు

మూమునూర్​ ఎయిర్​పోర్టుకు భూసేకరణ  ఎకరానికి రూ.1.20 కోట్లు
  • 309 మంది రైతుల వద్ద నుంచి 220 ఎకరాలు సేకరించనున్న ప్రభుత్వం
  • ప్లాట్ల ధరలపై రాని క్లారిటీ
  • గజానికి గరిష్టంగా రూ.6 వేలు చెల్లించేలా ఆఫీసర్ల అడుగులు 
  • రూ.12 వేల నుంచి రూ.16 వేలు చెల్లించాలని ఓనర్ల డిమాండ్

వరంగల్, వెలుగు: వరంగల్ మామునూర్ ఎయిర్​పోర్ట్ నిర్మాణంలో కీలకమైన భూ సేకరణకు దాదాపు లైన్ క్లియర్ అయింది. నిర్వాసితుల్లో రైతులకు ఒక్కో ఎకరానికి రూ.1.20 కోట్ల చొప్పున చెల్లించేందుకు జిల్లా అధికారులు ధర నిర్ణయించారు. ఇందులో భాగంగా రైతులు, ప్లాట్ల యజమానులతో పలుమార్లు సమావేశమైన కలెక్టర్, ఇతర అధికారులు రైతుల భూముల విషయంలో ఒక క్లారిటీకి వచ్చారు. వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసినవారు, సొంత ప్లాట్లు ఉన్నవారు మాత్రం ప్రభుత్వం ఇచ్చే పరిహారానికి ఒప్పుకోబోమని, రేటు మరింత పెంచాలంటున్నారు. కొందరు కోర్డు గడప తొక్కారు. అధికారులు వారిని సైతం ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. 

220 ఎకరాలు.. 61 వేల గజాలు 

మామునూర్ ఎయిర్​పోర్ట్ పున:ప్రారంభానికి 949.14 ఎకరాల భూములు అవసరమవగా 696.14 ఎకరాలు ఎయిర్​పోర్ట్ పరిధిలో ఉన్నాయి. అభివృద్ధికి మరో 280.30 ఎకరాలు కావాలి. అయితే ఇందులో కొంతమేర ప్రభుత్వ భూమి ఉండగా 309 మంది రైతుల నుంచి 220 ఎకరాలు, మరో 50 మంది వద్ద 61,134.5 గజాల వరకు ప్లాట్లను సేకరించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఏకకాలంలో పరిహారం కోసం రూ.205 కోట్లు మంజూరు చేస్తూ గతేడాది నవంబర్17న ఉత్తర్వులు జారీ చేసింది. ఎయిర్​పోర్ట్ విస్తరణకు జీఎంఆర్​సంస్థతో 150 కిలోమీటర్ల అగ్రిమెంట్ సమస్య ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో అది పరిష్కారమైంది. ఫిబ్రవరి 28న కేంద్ర ప్రభుత్వం వరంగల్ కేంద్రంగా మామునూర్ ఎయిర్​పోర్ట్ విస్తరణకు గ్రీన్​సిగ్నల్ ఇచ్చింది. నాటినుంచి గుంటూరుపల్లి, నక్కలపల్లి, గాడిపల్లికి చెందిన రైతులు, ప్లాట్ల ఓనర్ల నుంచి భూసేకరణ బిగ్​టాస్క్ గా మారింది. 

తొలుత రూ.30 లక్షలు.. 

భూసేకరణకు రైతులను ఒప్పించడానికి జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్​రెడ్డి, కేఆర్.నాగరాజు పలుమార్లు సమావేశమయ్యారు. మొదట్లో ఎకరానికి రూ.30 లక్షలు ఇవ్వనున్నట్లు చెప్పారు. సమావేశం జరిగిన ప్రతీసారి ధరలు పెరుగుతూ రూ.60 లక్షలకు చేరింది. అయినా సమస్యకు పరిష్కారం దొరకలేదు. 

మార్చి 4న సర్వే కోసం వెళ్లిన ఆర్డీవో సత్యపాల్​రెడ్డి, తహసీల్దార్​నాగేశ్వరరావులతో కూడిన బృందాన్ని రైతులు అడ్డుకున్నారు. తర్వాత కలెక్టర్ ఆధ్వర్యంలో ఆర్అండ్​బీ, ఇతర శాఖల అధికారులతో కలిసి నెగోషియేషన్ కమిటీ ఏర్పాటు చేశారు. పలు దఫాల చర్చల అనంతరం రూ.80 లక్షల నుంచి రూ.కోటికి పెరిగింది. చివరి అవకాశంగా కమిటీ కాన్సెంట్అవార్డుగా ఎకరానికి రూ.1.20 కోట్లు నిర్ణయించింది. 

ప్లాట్ల యజమానులతో చర్చలు విఫలం

మామునూర్ భూనిర్వాసితులు359 మంది. వీరిలో 86 శాతం మంది రైతులే. మరో 14 శాతం వెంచర్లు, ప్లాట్ల యజమానులున్నారు. అక్షర రియల్ ఎస్టేట్ లో ప్లాట్లు కొనుగోలు చేసిన 33 మందితోపాటు మరో 17 మంది ప్లాట్ల ఓనర్లు తమ ప్లాట్లకు రైతుల భూముల తరహాలోనే ధరలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. 33 మంది కోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో కలెక్టర్​సత్యశారద, అధికారుల బృందం వారిని గురువారం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. తనకున్న అధికారాల మేరకు ఒక్కో గజానికి రూ.4,887 చొప్పున చెల్లించడానికి అవకాశమున్నట్లు కలెక్టర్​చెప్పడంతో యజమానులు తిరస్కరించారు. 

తాము మూడు, నాలుగేండ్ల క్రితమే గజానికి రూ.6,500 ధర చొప్పున కొనుగోలు చేశామని అంతకన్నా తక్కువ ఇవ్వడం సబబుకాదన్నారు. మెయిన్ రోడ్ల వెంట ఉండే ప్లాట్లు కాకుండా ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉండే ధరలను అందరికీ లెక్కకట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ధరల పెంపు తమ చేతుల్లో లేదని రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు. రైతుల భూముల తరహాలోనే రాష్ట్రస్థాయి నెగోషియేషన్ కమిటీ ప్లాట్ల యజమానులకు సైతం 84.1 శాతం పెంచేలా నిర్ణయం తీసుకుంటే గజానికి రూ.5,997 చెల్లించడానికి ఆస్కారం ఉండొచ్చన్నారు. దీన్ని కూడా వారు వ్యతిరేకించి, ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందన్నారు. చివరగా రూ.12 వేలు నుంచి రూ.16 వేల మధ్య చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే కోర్టు డైరెక్షన్​లో నడుచుకుంటామని చెప్పి, బయటకు వెళ్లి నిరసన తెలిపారు.