
దేశవ్యాప్తంగా ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ప్రతి సంవత్సరం ఇది సాధారణమే అయినా... చాలా ప్రదేశాల్లో జాతీయ జెండా ఆవిష్కరణలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. దేశ ఐక్యత, సమగ్రతకు చిహ్నంగా నిలిచే జెండా వందనం సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ తప్పులు చేయకూడదనే వివరాలు తెలుసుకుందాం. .. ..
మరో రెండ్రోజుల్లో ( వార్త రాసే రోజు నుంచి) దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుక. దేశం మొత్తం పంద్రాగస్టు వేడుకల్లో మునిగిపోతుంది. వాడవాడలా, ప్రతి ఇంటా మువ్వన్నెల జెండా ఎగురనుంది. జెండా వందనం చేయడం కంటే తప్పులు దొర్లకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. జెండా వందనంలో తప్పులేముంటాయని అనుకోవద్దు.. ఇండిపెండెన్స్ డే 2023 ఉత్సవాలకు అంతా సిద్ధమైంది. మరో రెండ్రోజుల్లో ( వార్త రాసే రోజు నుంచి) దేశ రాజధాని ఎర్రకోట సాక్షిగా మువ్వన్నెల జండా రెపరెపలాడనుంది. అదే సమయంలో దేశం మొత్తం ఊరూరా జెండా వందన కార్యక్రమాలు జరగనున్నాయి. విద్యాసంస్థలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రతి వాడలో, ప్రతి వీధిలో స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు కనిపిస్తాయి.
పంద్రాగస్టున దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ ఎర్రకోటలో జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదే విధంగా అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, వివిధ జిల్లాల్లో మంత్రులు లేదా కలెక్టర్లు లేదా ఎస్పీలు ఇలా వివిధ ప్రాంతాల్లో జెండా వందన కార్యక్రమాలు నిర్వహించడం తప్పనిసరి. ఆగస్టు 15వ తేదీ ఉదయం జెండా వందనం ఊరూరా అత్యంత ఘనంగా జరగనుంది.
జెండా వందనం అంటే ఏదో మూడు రంగుల జెండాను ఎగురవేయడం కానే కాదు. ఇది అసలు మొక్కుబడి తతంగం అస్సలు కాదు. జెండా వందనం అంటే దేశ సమగ్రతకు చిహ్నం. దేశ ఐక్యతకు నిదర్శనం. దేశ స్వాతంత్య్రోత్సవాలకు సంకేతం. దేశాన్ని ఐక్యంగా ఉంచే అత్యున్నతమైన పతాకమది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న జెండా వందన కార్యక్రమానికి సహజంగానే పాటించాల్సిన నియమ నిబందనలుంటాయి. జాగ్రత్తలుంటాయి. చేయకూడని తప్పులుంటాయి.
జెండా పరిమాణం ఎంత ఉండాలి
జాతీయ జెండాకు ఓ నిర్దిష్టమైన పరిమాణం నిష్పత్తి ఉంటుంది. జెండా పొడుగు, ఎత్తు అనేవి 3:2 గా ఉండాలి. మూడు రంగులు సమానమైన పరిమాణంలో ఉండాలి. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల పరిమాణంలో హెచ్చుతగ్గులుండకూడదు. జెండాకు వాడే వస్త్రం కాటన్ లేదా సిల్క్ అయుండాలి. లేదా హ్యాండ్లూమ్ అయినా ఫరవాలేదు. ఎందుకంటే కాషాయం శక్తి,సామర్ధ్యాలకు ప్రతీక అయితే, తెలుపు శాంతి, సమృద్ధికి చిహ్నం. ఇక ఆకుపచ్చ అనేది త్యాగం, శాంతి, సౌభ్రాతృత్వాలకు నిదర్శనం. ఇక అశోక చక్రం అనేది ధర్మానికి ప్రతీక.
జెండా ఎగురవేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు
జాతీయ జెండా ఎగురవేసేటప్పుడు ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా పాటించాలి. అంటే జాతీయ జెండా పొరపాటున కూడా నేలను తాకకూడదు. అగౌరవపర్చకూడదు. నీటిలో వేయకూడదు. చిరిగిన, పాడైపోయిన, మసిబారిన జెండాను వాడితే అది జాతీయ జెండాను అగౌరవపర్చడమే అవుతుంది. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా కింద శిక్షార్హులౌతారు. జాతీయ జెండా గౌరవానికి భంగం కలగకుండా ఎవరైనా ఎగురవేయవచ్చు. ముఖ్యంగా విద్యాసంస్థలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పకుండా ఎగురవేయాలి. జెండా ఎగురవేసే ప్రాంతం పరిశుభ్రంగా ఉండాలి. ఫార్మల్ దుస్తులు ధరించాలి. జెండాను ఎగురవేసేటప్పుడు వేగాన్ని, దించేటప్పుడు నెమ్మదిని ప్రదర్శించాలి.
చేయకూడని తప్పులు
జాతీయ జెండాను మత, రాజకీయ ప్రయోజనాలకు వాడకూడదు. జాతీయ జెండాను అలంకరణకు వినియోగించకూడదు. టేబుల్ క్లాత్, హ్యాండ్ కర్చీఫ్, డిస్పోజబుల్ ఐటమ్గా జాతీయ జెండా ఉండకూడదు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంలోపు జెండాను ఎగురవేయాలి. జాతీయ జెండా కంటే మరేదీ ఎత్తులో ఉంచకూడదు. జెండాపై ఏ విధమైన వస్తువులుంచకూడదు.