ప్రియుడితో భర్తను చంపించిన భార్య! వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ఘాతుకం.. పటాన్చెరులో ఘటన

ప్రియుడితో భర్తను చంపించిన భార్య! వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ఘాతుకం.. పటాన్చెరులో ఘటన

గచ్చిబౌలి, వెలుగు: వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియుడితో ఓ మహిళ తన భర్తను చంపించింది. పటాన్​చెరు ఇండస్ట్రియల్​ఏరియాలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదుచేసి దర్యాప్తు చేసిన పోలీసులు.. శనివారం మృతుడి భార్య, ఆమె ప్రియుడిని అరెస్ట్​ చేశారు. గచ్చిబౌలిలోని శేరిలింగంపల్లి డీసీపీ ఆఫీస్​లో డీసీపీ శ్రీనివాస్ శనివారం కేసు​వివరాలను మీడియాకు వెల్లడించారు. పటాన్​చెరు చైతన్యనగర్​కు చెందిన బైండ్ల నవీన్​(24) వాల్యూజోన్ ​పక్కన చిన్న హోటల్ ​నిర్వహిస్తున్నాడు. అదే కంపెనీలో పటాన్​చెరు మండలం ఇస్నాపూర్​ గ్రామానికి చెందిన రాయిగల్ల శేఖర్​(36) గూడ్స్​ఆటో డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో నవీన్, శేఖర్​ల మధ్య స్నేహం ఏర్పడింది. 

శేఖర్​కు ఆర్థికంగా ఇబ్బందులు ఉండడంతో నవీన్​ డబ్బు సహాయం చేసేవాడు. ఇదే సమయంలో నవీన్​అప్పుడప్పుడు శేఖర్​ ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో శేఖర్​ భార్య ప్రమీల(27)తో నవీన్​కు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ప్రమీల ఏడు నెలల గర్భిణి. భర్తకు ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో నవీన్​ వీరికి ఆర్థికంగా సహాయం చేసేవాడు. ఒకరోజు ఇంట్లో తన భార్యతో నవీన్​​సన్నిహితంగా ఉండడంతో శేఖర్ అనుమానం పెంచుకున్నాడు. దీంతో శేఖర్​ తన భార్యను కొట్టి, నవీన్​కు వార్నింగ్ ​ఇచ్చాడు. తమ అక్రమ సంబంధానికి శేఖర్​ అడ్డు వస్తున్నాడని, ఎలాగైనా అతడిని అంతమోందించాలని నవీన్​, ప్రమీల ప్లాన్​ వేశారు. 

  • మద్యం మత్తులో బండరాయితో కొట్టి హత్య..

ఈ నెల 15న ఒకసారి కలుద్దామని శేఖర్​ను నవీన్​పటాన్​చెరులోని క్యాండిడస్​ ఇంటర్నేషనల్​ స్కూల్​ వెనుక వైపు ఉన్న ఖాళీ ప్రదేశానికి రప్పించాడు. అక్కడ ఇద్దరు కలిసి మద్యం తాగారు. శేఖర్​ మద్యం మత్తులో ఉండగా నవీన్​ తన డబ్బులు ఎప్పడు తిరిగి ఇస్తావని, ప్రమీలను ఎందుకు వేధిస్తున్నావని గొడవ పడ్దాడు. అక్కడే ఉన్న ఓ బండరాయిని తీసుకొని శేఖర్​తలపై బలంగా కొట్టాడు. దీంతో తలకు తీవ్ర గాయాలై శేఖర్​స్పాట్​లోనే మృతి చెందాడు. మృతదేహాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నించిన నవీన్​ కొద్దిదూరం లాక్కెళ్లి ఆ తర్వాత మృతదేహంపై అట్టముక్కలు పెట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 

హత్య విషయాన్ని శేఖర్ భార్య ప్రమీలకు నవీన్​ ఫోన్​ చేసి చెప్పాడు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పటాన్​చెరు పోలీసులు స్పాట్​కు చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతుడు ఇస్నాపూర్​కు చెందిన శేఖర్​గా గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగించారు. శేఖర్​ సోదరుడు యేసుదాస్​ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శేఖర్​ హత్యపై భార్య ప్రమీలను అడగ్గా తనకేమి తెలియదని పోలీసులను తప్పుదోవ పట్టించింది. 

అంతేకాకుండా నవీన్​కు ఎప్పటికప్పుడు ఫోన్​ చేసి సమాచారం అందించింది. అయితే, పోలీసులకు అనుమానం వచ్చి ప్రమీలను తమదైన శైలిలో ప్రశ్నించడంతో హత్య విషయం పోలీసులకు చెప్పింది. దీంతో పటాన్​చెరు పోలీసులు ప్రమీలతో పాటు ఆమె ప్రియుడు నవీన్​ను అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. ఇద్దరి వద్ద నుంచి మూడు సెల్​ఫోన్లు, ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నారు.