ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫస్ట్ ఫేజ్ ఎన్నికలకు రెడీ

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫస్ట్ ఫేజ్ ఎన్నికలకు రెడీ
  • పోలీస్​ స్టేషన్లలో బ్యాలెట్​ పేపర్లు
  • సెంటర్లకు బ్యాలెట్​ బాక్సులు .. 3 వేల మంది స్టాఫ్​ 
  • బస్సులు సహా 164 వెహికల్స్​.. 14 సెంటర్లలో వెబ్​ కాస్టింగ్​

యాదాద్రి, వెలుగు: మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. బ్యాలెట్​ పేపర్లు, బాక్సుల తరలింపు పూర్తయింది.  ఎన్నికల ప్రక్రియలో వేల సంఖ్యలో స్టాఫ్​ను ఎంపిక పూర్తయింది. పోలింగ్​ సెంటర్లలో వెబ్​ కాస్టింగ్​ కూడా చేయనున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. 

ఫస్ట్​ ఫేజ్​లో 137

యాదాద్రి జిల్లాలో ఫస్ట్​ ఫేజ్​లో ఆరు మండలాల్లోని 153 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. 1,62,401 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 80,497 కాగా, మహిళలు 81,902, ఇద్దరు థర్డ్​జెండర్లు ఉన్నారు. కాగా ఇందులో 16 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అయితే 11 పంచాయతీల్లో మొత్తం పాలకవర్గం ఏకగ్రీవం కాగా, 5 పంచాయతీల్లో వార్డు మెంబర్లకు ఎన్నిక జరగాల్సి ఉంది. దీంతో 137 పంచాయతీల్లో  సర్పంచ్​ పదవి కోసం 397 మంది పోటీ పడుతున్నారు. 1040 వార్డులకు 2436 మంది పోటీ పడుతున్నారు. 

పోలీస్​ స్టేషన్లకు బ్యాలెట్​ పేపర్లు

ఎన్నికలు జరగాల్సిన పంచాయతీలకు, వార్డు స్థానాలకు సంబంధించి బ్యాలెట్​ పేపర్లు ఆలేరు, ఆత్మకూరు(ఎం), బొమ్మల రామారం, రాజాపేట, తుర్కపల్లి, యాదగిరిగుట్ట పోలీస్​ స్టేషన్లకు చేరాయి. 135 పంచాయతీల ఓటర్లకు సంబంధించి పింక్​ బ్యాలెట్​ పేపర్లు, 1040 వార్డులకు సంబంధించి వైట్​ కలర్​ బ్యాలెట్​పేపర్లను పంచాయతీల వారీగా డివైడ్​ చేసి పంపించారు. వీటిని ఈ నెల 10న రాత్రి తరలిస్తారు.  అదే విధంగా బ్యాలెట్​ బాక్సులు సహా పోలింగ్​ రోజున అవసరమయ్యే 53 రకాల సామగ్రిని  డిస్ట్రిబ్యూషన్​ సెంటర్ల నుంచి పోలింగ్​ సెంటర్లకు తరలిస్తారు. 

ఫస్ట్​ ఫేజ్​ కోసం..

మూడు దశల్లో జరిగే ఎన్నికల కోసం మొత్తంగా 8 వేల మంది విధులు నిర్వర్తించనున్నారు. ఇందులో ఫస్ట్​ ఫేజ్​ కోసం మూడు వేల మందిని విధులు నిర్వహించనున్నారు. అయితే వీరికి ఈ నెల 10న ఏయే పంచాయతీల్లో విధులు నిర్వర్తించాలో చెబుతారు. 23 మంది రిటర్నింగ్​ ఆఫీసర్లు, 38 మంది జోనల్​ ఆఫీసర్లు విధులు నిర్వర్తిస్తారు. స్టాఫ్​ కోసం 126 బస్సులు, జోనల్​ ఆఫీసర్ల కోసం 38 ​ వెహికల్స్​ను ఏర్పాటు చేశారు. 

52 సెన్సిటివ్​ సెంటర్లు

ఎన్నికలు నిర్వహించే 1040 సెంటర్లలో 52 సెన్సిటివ్​ సెంటర్లుగా ఆఫీసర్లు గుర్తించారు. ఆత్మకూరు (ఎం), రాజాపేటలోని 14 పోలింగ్​ సెంటర్లలో వెబ్​ కాస్టింగ్​ చేయనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు నుంచి మూడు పోలింగ్​ సెంటర్లకు ఒక వెహికల్​లో పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటారు.