అందుకే లేఖ దాచిపెట్టమని చెప్పా: సీబీఐకి సునీత భర్త వాంగ్మూలం

అందుకే లేఖ దాచిపెట్టమని చెప్పా: సీబీఐకి సునీత భర్త వాంగ్మూలం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తులో కీలక అంశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పలువురు కీలక సాక్షులు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలాలు బయటకు రాగా.. తాజాగా వివేకా కూతురు సునీతా రెడ్డి  భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం వెలుగు చూసింది. హత్య జరిగిన రోజు ఉదయం 6.30 గంటలకు వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి ఫోన్‌ చేసి ఘటనా స్థలిలో లేఖ ఉందని చెప్పారని రాజశేఖర్‌రెడ్డి సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. అయితే  వైఎస్‌ రాజారెడ్డి హత్య తర్వాత ఘటనా స్థలంలో  లభించిన లేఖను తాను వచ్చే వరకు దాచిపెట్టమని చెప్పానని సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి సీబీఐకి తెలిపారు. లేఖలో ఏముందని అడగ్గా.. డ్రైవర్‌ ప్రసాద్‌ బాధ్యుడిగా ఉందని కృష్ణారెడ్డి చెప్పారన్నారు. రాజారెడ్డి హత్య సమయంలో జరిగిన పరిణామాలతో పాటు  ప్రసాద్‌కు ఉన్న  ప్రాణహానిని దృష్టిలో పెట్టుకొని.. తాను వచ్చి వ్యక్తిగతంగా పోలీసులకు ఇస్తానని చెప్పినట్టు పేర్కొన్నారు..

వివేకా పేరిట ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలుసా? అని సీబీఐ అడగ్గా.. కొన్ని తెలుసని రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. హత్యకు ముందు రోజు రాత్రి కడప ఎంపీగా తాను పోటీ చేయనున్నట్టు జమ్మలమడుగులో వివేకా చెప్పినట్టు తెలిసిందని రాజశేఖర్‌రెడ్డి సీబీఐకి తెలిపారు. జమ్మలమడుగు ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా అవినాష్‌కు మద్దతివ్వాలని ప్రభావతమ్మను వివేకా కోరినట్టు తెలిసిందన్నారు. హత్యకు ముందు రోజు మార్చి 13న శివశంకర్‌రెడ్డి గూగుల్‌ టేకవుట్‌ లొకేషన్‌ను సీబీఐ చూపించగా.. అది వివేకా ఇంటిదేనని నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి గుర్తించారు. 

సాధారణంగా శివశంకర్‌రెడ్డి తమ ఇంటికి ఎప్పుడూ రాడని చెప్పారు. ఆరోజున ఎంవీ కృష్ణారెడ్డి ఫోన్‌ చేసి వివేకానందరెడ్డి పులివెందులకు ఎప్పుడొస్తున్నారని ఆరా తీశారని, తాము కడపలో ఉన్నామని చెప్పినట్టు నర్రెడ్డి వివరించారు. రాజశేఖర్‌రెడ్డిని సాక్షిగా పేర్కొంటూ ఆయన వాంగ్మూలాన్ని జూన్  30న అనుబంధ ఛార్జిషీట్‌తో పాటు కోర్టుకు సీబీఐ సమర్పించింది..