
బ్యాంకాక్: ఇంటర్నేషనల్ క్రికెట్లో ఒక మ్యాచ్లో ఒక్కరు రిటైర్డ్ ఔటవ్వడమే అరుదు. అలాంటిది ఒక మ్యాచ్లో.. ఒకే ఇన్నింగ్స్లో పది మంది రిటైర్డ్ ఔట్ అయితే ఎలా ఉంటుంది. విమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఆసియా క్వాలిఫయర్లో జరిగిన ఈ అనూహ్య సంఘటన క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఖతార్ జట్టుతో మ్యాచ్లో యూఏఈ జట్టులోని మొత్తం బ్యాటర్లు రిటైర్డ్ ఔట్ అవ్వడం సంచలనంగా మారింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు వచ్చిన యూఏఈకి ఓపెనర్లు ఈషా ఓజా (113), తీర్థ సతీష్ (74) అద్భుతమైన ఆరంభం ఇచ్చారు.
వీళ్ల జోరుతో 16 ఓవర్ల ముగిసే సమయానికి 192/0 నిలవగా వర్షం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మ్యాచ్ను వేగంగా ముగించేందుకు యూఏఈ జట్టు వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకుంది. 17వ ఓవర్ ప్రారంభంలో మిగతా 10 మంది బ్యాటర్లు ఒక్క బాల్ కూడా ఎదుర్కోకుండా రిటైర్డ్ ఔట్ అవుతున్నట్టు ప్రకటించారు. ఈ ప్లాన్ వర్కౌట్ అయింది. 193 టార్గెట్ ఛేజింగ్కు వచ్చిన ఖతార్ జట్టు.. యూఏఈ బౌలర్ల ధాటికి 11.1 ఓవర్లలో కేవలం 29 రన్స్కే ఆలౌటైంది. రిజ్ఫా ఇమాన్యుయేల్ (20) తప్ప మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్కే ఔటయ్యారు. ఫలితంగా ఈ మ్యాచ్లో యూఏఈ 163 రన్స్ తేడాతో విజయం సాధించింది. మొత్తం 10 మంది బ్యాటర్లు రిటైర్డ్ ఔట్ కావడం క్రికెట్ చరిత్రలో అరుదైన ఘటనగా నిలిచింది.