- రాష్ట్రంలోనూ ఈడబ్ల్యూఎస్ కోటా
- 8 లక్షల లోపు ఆదాయం ఉన్న ఓసీలకు
- విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్
- ఈడబ్ల్యూఎస్ వాళ్లకు సర్కారు కొలువుల్లో
- గరిష్ట వయోపరిమితి ఐదేండ్లు సడలింపు ఆమోదించిన కేబినెట్
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్ (ఎకనమికల్లీ వీకర్ సెక్షన్) రిజర్వేషన్ను రాష్ట్రంలోనూ అమలు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం జరిగిన సమావేశంలో ఆమోదముద్ర వేసింది. రూ. 8 లక్షలలోపు ఆదాయం ఉన్న ఓసీలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఈ రిజర్వేషన్ వర్తించనుంది. ఈడబ్ల్యూఎస్ కోటాలోని వారికి రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసే ఉద్యోగాల్లో గరిష్ట వయోపరిమితిలో ఐదేండ్లు సడలింపును ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విద్య, ఉద్యోగ రంగాల్లో ప్రస్తుతం 50 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. బీసీలకు 25 శాతం, ఎస్సీలకు 15, ఎస్టీలకు 6, మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ వర్తింపజేస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాతో అదనంగా మరో పది శాతం రిజర్వేషన్ అందుబాటులోకి రానుంది. దీంతో మొత్తం రిజర్వేషన్లు 60 శాతానికి చేరనుండగా.. జనరల్ కోటా 40 శాతంగా ఉండనుంది.
రాష్ట్రంలోనూ ఈడబ్ల్యూఎస్ కోటా
రాష్ట్ర జనాభాలో 9 నుంచి 10 శాతం వరకు ఓసీలు ఉన్నట్టు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. వీరిలో కొందరు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు. అలాంటి వారు విద్య, ఉద్యోగ రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకునేందుకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రవేశపెట్టారు. ఇప్పటికే ఎంబీబీఎస్, ఐఐటీల్లో ఈ రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. ఇకపై ఎంసెట్, ఐసెట్తో పాటు ఇతర సెట్లలో అర్హత సాధించే అగ్రవర్ణ పేదలకు ఈ రిజర్వేషన్ వర్తించనుంది. ప్రభుత్వం భర్తీ చేస్తామంటున్న 50 వేల ఉద్యోగాల్లోనూ ఈ కోటా అమలు చేయనున్నారు. ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి కూడా తాము చేపట్టే నియామకాల్లో ఈ కోటాను అమలు చేయాలని ఇటీవల జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఇతర ప్రభుత్వరంగ సంస్థల్లోనూ ఈ రిజర్వేషన్ అందుబాటులో రానుంది.