హైదరాబాద్ : ఇన్స్టంట్ లోన్ యాప్స్ కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇండిట్రేడ్ ఫిన్క్రాప్ లిమిటెడ్, అగ్లో ఫిన్ట్రేడ్, ఫిన్టెక్తో సహా మొత్తం 12 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీలకు చెందిన 233 అకౌంట్లను ఫ్రీజ్ చేశామని అధికారులు బుధవారం వెల్లడించారు. ఆ అకౌంట్లలో ఉన్న ఉన్న రూ.105.32 కోట్లను సీజ్ చేశామని చెప్పారు. 7 నుంచి 30 రోజల టైమ్ బాండ్తో ఆర్బీఐ రూల్స్కు విరుద్ధంగా యాప్ల ద్వారా లోన్లు ఇచ్చారని, చెల్లించనోళ్లను ఎక్కువ మిత్తీల కోసం వేధించారని తేల్చారు. 12 కంపెనీల ద్వారా ఇప్పటివరకు రూ.4,430 కోట్ల లోన్లు ఇచ్చినట్లు ఆధారాలు సేకరించారు. ఇందులో రూ.819 కోట్లు లాభం వచ్చినట్లుగా డిజిటల్ ఆడిట్లో అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం రూ.264 కోట్లు అటాచ్ చేసినట్లు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రకటించారు.