అంబులెన్స్లో పోతుంటే ఆటో ఢీకొట్టింది
11 నెలల చిన్నారి మృతి
ఎల్బీ నగర్, వెలుగు: జ్వరంతో బాధపడుతున్న చిన్నారిని అంబులెన్స్లో హాస్పిటల్ తీసుకెళ్తుండగా ఆటో ఢీకొని మృతిచెందింది. అబ్దుల్లాపూర్మెట్ వద్ద హైదరాబాద్–-విజయవాడ నేషనల్ హైవేపై ఈ యాక్సిడెంట్ అయింది. స్థానిక సీఐ దేవేందర్ తెలిపిన వివరాల ప్రకారం. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం రాజగుట్టకు చెందిన గుంటి భాస్కర్కు ఇద్దరు బిడ్డలు. చిన్న కూతురు దీక్ష(11 నెలలు) కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. మూడు రోజులుగా మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు దవాఖానాలో ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. అయినా తగ్గకపోవడంతో డాక్టర్లు హైదరాబాద్కు రెఫర్ చేశారు. దీంతో గురువారం కుటుంబసభ్యులు చిన్నారిని తీసుకొని ప్రైవేట్ అంబులెన్స్లో బయల్దేరారు. అబ్దుల్లాపూర్మెట్ చేరుకోగానే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సమీపంలో యూ టర్న్ వద్ద ఓ ఆటో వీరి అంబులెన్స్ను ఢీ కొట్టింది. చిన్నారి ఒక్కసారిగా తల్లి చేతుల్లోంచి ఎగిరి అంబులెన్స్ డ్రైవర్ సీటుకు బలంగా తగిలింది. తల, మెడ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమీపంలోని హాస్పిటల్కు తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందిందని డాక్టర్లు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.