12 ఎంపీ సీట్లు గెలువబోతున్నం : డీకే అరుణ

12 ఎంపీ సీట్లు గెలువబోతున్నం : డీకే అరుణ
  •      బీజేపీని గెలిపించి నారీశక్తి ఏంటో నిరూపించాలి 

హైదరాబాద్, వెలుగు: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఖాయమని, తెలంగాణలోనూ 12 సీట్లు కైవసం చేసుకోబోతున్నామని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మహిళలంతా బీజేపీని గెలిపించి తమ నారీశక్తిని నిరూపించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని బీజేపీ స్టేట్‌ ఆఫీసులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.

 దీనికి చీఫ్ గెస్టుగా డీకే అరుణ హాజరై, రాష్ట్రంలోని వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలను సన్మానించారు. అనంతరం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపులో మహిళా మోర్చా కార్యాచరణను వివరించారు. మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యం సాధించే దిశగా మోదీ పాలన ఉందని చెప్పారు. 33 శాతం రిజర్వేషన్లతో భవిష్యత్‌లో మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం రాబోతోందని చెప్పారు.

 వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే మహిళలు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల కంటే మహిళలే కుటుంబ పోషణలో ఎక్కువగా కష్టపడుతున్నారని చెప్పారు. రామరాజ్య స్థాపనలో ముందడుగు వేసిన మోదీకి మహిళలంతా అండగా నిలవాలని కోరారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మహిళా మోర్చా నేతలు అంకిత భావంతో పనిచేసి పార్టీ గెలుపులో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవిలత తదితరులు పాల్గొన్నారు.