
లిక్విడ్ నైట్రోజన్ పాన్ తిన్న 12 ఏళ్ల బెంగళూరు బాలికకు కొద్దిసేపటి తరువాత కడుపులో నొప్పి, మంట ప్రారంభమయ్యాయి. ఇవి క్రమేపి పెరగడంతో తట్టుకోలేని స్థితికి చేరుకుంది. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు బెంగళూరులోని నారాయణ మల్టీ స్పెషాలిటి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాత పెర్ఫోరేషన్ పెరిటోనిటిస్తో బాధపడుతున్నారని నిర్ధారించారు. కడుపులో రంధ్రం ఏర్పడి చాలా ఇబ్బందిగా ఉంటుందని వైద్యులు తెలిపారు. స్మోకింగ్ పాన్ తినడం వలన ఇలా జరుగుతుందని తెలిపారు.
స్మోకింగ్ పాన్ ను నైట్రోజన్.. లేదా నత్రజని ద్రవ పదార్దంతో తయారు చేస్తారు. ఇదిపొట్టలో చాలా సమస్యలు కలుగజేస్తుందని వైద్యులు తెలిపారు. ఆ బాలికకు ఇంకా మరికొన్ని వైద్య పరీక్షలు నిర్వహించి.. ఇంకా సమస్యలు రాకుండా ఆపరేషన్ చేయాలని సూచించారు. ఇంట్రా-ఆప్ OGD స్కోపీ మరియు స్లీవ్ గ్యాస్ట్రెక్టమీతో లాపరోటమీ ద్వారా శస్త్ర చికిత్స చేశారు.
ఇంట్రా-ఆప్ OGD స్కోపీ అంటే ఎండోస్కోప్, కెమెరా .. లైట్తో కూడిన ఫ్లెక్సిబుల్ ట్యూబ్ . ఇది ఆపరేషన్ చేసేటప్పుడు అన్నవాహిక ద్వారా కడుపులోని -చిన్న ప్రేగు ( డ్యూడెనమ్) ఎలా ఉందో పరిశీలిస్తుందని డాక్టర్ విజయ్ హెచ్ఎస్ వివరించారు. ఆ బాలికకు పొట్టలో 4x5 సెంటీమీటర్ల భాగాన్ని కట్చేసి తొలగించినట్లు సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ వైద్యులు తెలిపారు. స్మోకింగ్ పాన్ తినడం వలన పొట్టలో కొంత భాగం కాలిపోయిందని దీంతో అనేక ఇబ్బందులు వచ్చాయని అది అలానే ఉంటే ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు. చికిత్స అనంతరం ఆరు రోజుల తర్వాత ఆ బాలిక డిశ్చార్జ్ అయింది.
నైట్రోజన్, నత్రజనితో తయారు చేసిన పదార్దాలకు ప్రజాదరణ పెరగడం చాలా ఇబ్బందికరంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలన్నారు. ఆరోగ్యాన్ని దెబ్బతీసే పదార్దాలను తినకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని డాక్టర్ విజయ్ అన్నారు. 2017లో గురుగ్రామ్లో కాక్టెయిల్ తాగిన ఓ వ్యక్తి బాధపడిన కేసును వివరిచారు. 20 డిగ్రీల సెల్సియస్ వద్ద ద్రవ నైట్రోజన్ విడుదల చేసే ద్రవాలు ఆరోగ్యానికి ప్రమాదాన్ని తెచ్చి పెడతాయని వివరించారు. ద్రవ నత్రజని బాష్పీభవనం అపారమైన శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ అస్థిర రసాయన చర్య వలన స్కిన్ ఎలర్జీ వస్తుంది. ఈ ఆవిరిని పీల్చడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి . ద్రవ నత్రజని ప్రమాదకర స్వభావం కారణంగా కణజాలం దెబ్బతింటాయని వైద్య నివేదికల ద్వారా తెలుస్తోంది.