128 కిలోల గంజాయి పట్టివేత

128 కిలోల గంజాయి పట్టివేత
  • నలుగురు ముఠా సభ్యులు అరెస్ట్
  • రూ.64 లక్షల విలువైన సరుకు స్వాధీనం

పటాన్​చెరు, వెలుగు: సంగారెడ్డి జిల్లా బీడీఎల్ -భానూర్  పోలీస్ స్టేషన్  పరిధిలోని పాటి ఎక్స్ రోడ్  వద్ద టీఎస్ -న్యాబ్, పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. రూ.64 లక్షల విలువ చేసే 128 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని, నలుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్​ చేశారు.  ఇన్స్​పెక్టర్  విజయ్  కృష్ణ, సంగారెడ్డి టీఎస్ -న్యాబ్  ఇన్స్​పెక్టర్  నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో పోలీసులు ముత్తంగి వద్ద ఆదివారం వాహన తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్  నుంచి వస్తున్న కారు, బొలెరో వెహికల్స్​ను పరిశీలించగా, 55 గంజాయి ప్యాకెట్లు గుర్తించారు. 

ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లాకు చెందిన రాజ్ కుమార్  వద్ద గంజాయి తెచ్చి మహారాష్ట్రలో అమ్మేందుకు తీసుకెళ్తున్నట్లు నిందితులు అంగీకరించారు. మహారాష్ట్రకు చెందిన  ఫిరోజ్  అహ్మద్, ఒడిశా గజపతి జిల్లాకు చెందిన సగర్ నాయక్ అలియాస్​ సగర్, మలేగావ్​ మహారాష్ట్రకు చకెందిన  మెహబూబ్  అబ్దుల్  అహ్మద్  అలియాస్​ అంసారీ,  మహారాష్ట్రకు చెందిన  మహ్మద్ ఇర్ఫాన్ ను అరెస్ట్​ చేశారు.  ఐదు మొబైల్  ఫోన్లు, రెండు కార్లను  స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.