- అంజయ్య విగ్రహం ముందున్న స్థలాన్ని యథావిధిగా ఉంచాలె : కోదండరెడ్డి
హైదరాబాద్, వెలుగు: లుంబినీ పార్క్ను 13 ఎకరాల నుంచి 5 ఎకరాలకు కుదించారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్క్లోని అంజయ్య విగ్రహం ముందు ఉన్న స్థలాన్ని సెల్ఫీ పార్క్, పార్కింగ్ ప్రదేశాలుగా మార్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు పేరు రావాలన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ పాత సెక్రటేరియెట్ను కూల్చి.. కొత్తది కట్టారని, ఇప్పుడు అదే రీతిలో లుంబినీ పార్క్ దగ్గర మార్పులు చేశారని ఆరోపించారు.
మంగళవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. అంజయ్య విగ్రహం ముందున్న స్థలాన్ని యథావిధిగా ఉంచాలని, వారం రోజులు టైం ఇస్తున్నామని తేల్చి చెప్పారు. ప్రభుత్వం అనుకూల నిర్ణయం తీసుకోకుంటే తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. సెక్రటేరియెట్ పరిసరాల్లో కోట్లు ఖర్చు పెట్టి కార్ల రేసింగ్ నిర్వహించడమేంటని ఆయన ప్రశ్నించారు. కోతుల వల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతున్నా.. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కమర్షియల్గా ఆలోచించడం మానుకోవాలని కోదండ రెడ్డి హితవు పలికారు.
