
13 రాష్ట్రాలు బంద్
కరోనా ఎఫెక్ట్తో లాక్డౌన్ వైరస్ ప్రభావమున్న 75 జిల్లాలు కూడా
అత్యవసర, నిత్యవసర సర్వీసులే అందుబాటులో
కొన్ని చోట్ల ఇంటికే రేషన్
కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడానికి కేంద్ర, రాష్ట్రాలు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశంలో వైరస్ ప్రభావమున్న 75 జిల్లాలను లాక్డౌన్ చేస్తున్నట్టు కేంద్రం ఆదివారం ప్రకటించింది. మహమ్మారిని కట్టడి చేసేందుకు రాష్ట్రాలు చర్యలు ముమ్మరం చేశాయి. 31 వరకు లాక్డౌన్ చేస్తున్నట్టు 13 రాష్ట్రాలు ప్రకటించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఢిల్లీ, నాగాలాండ్, రాజస్థాన్,చత్తీస్గఢ్ నిర్ణయం తీసుకున్నాయి.
మార్చి 31 వరకు కర్ఫ్యూ
దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు బయటపడ్డ జిల్లాలను మార్చి 31 వరకు లాక్ డౌన్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఆదివారం ఆ జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో 75 జిల్లాల్లో మార్చి 31 వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. ఈ జిల్లాల్లో అత్యవసర, నిత్యావసర సేవలు మినహా మిగిలినవన్నీ బంద్ కాబోతున్నాయి. కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలో అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, ప్రధాని మోడీ ప్రిన్సిపల్ సెక్రటరీలతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అవసరమైతే ఇంటింటికీ రేషన్: ఉత్తరాఖండ్
ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా 31 వరకు లాక్డౌన్ ప్రకటించింది. నిత్యావసర దుకాణాలు ఎప్పటిలాగే కొనసాగుతాయంది. ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూ ప్రకటించిన రోజే ఉత్తరాఖండ్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. కర్ఫ్యూను విజయవంతం చేసినందుకు రాష్ట్ర ప్రజలకు ఆదివారం థాంక్స్ చెప్పిన ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్.. మున్ముందు తీసుకునే కఠిన నిర్ణయాలకు సిద్ధంగా ఉండాలని ప్రజలకు కోరారు.
ఢిల్లీలో 144 సెక్షన్
దేశ రాజధాని ఢిల్లీలో కూడా 31 వరకు లాక్డౌన్ను ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పారు. లాక్డౌన్ రోజుల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అన్నారు. 25 శాతం ట్రాన్స్పోర్ట్ సర్వీసులే నడుస్తాయన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 27 కేసులు నమోదయ్యాయి.
మహారాష్ట్రలో 144 సెక్షన్
మహారాష్ట్రలో మార్చి 22 నుంచి 31 వరకు 144 సెక్షన్ విధిస్తున్నట్టు ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ తెలిపారు. కేసులు పెరుగుతున్న ఈ టైమ్లో కఠిన నిర్ణయాలు తీసుకోవడం తప్ప వేరే మార్గం లేదన్నారు. అందుకే 144 సెక్షన్ విధిస్తున్నామని తెలిపారు. విదేశాల నుంచి రాష్ట్రంలోకి ఒక్క విమానానికీ అనుమతి లేదని చెప్పారు.
గుజరాత్లో గాంధీనగర్లోనూ లాక్డౌన్
ఇప్పటికే అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్కోట్లను మార్చి 25 వరకు లాక్డౌన్ చేస్తున్నట్టు వెల్లడించిన గుజరాత్ ప్రభుత్వం తాజాగా ఆ రాష్ట్ర రాజధాని గాంధీనగర్లోనూ లాక్డౌన్ విస్తరిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర సర్వీసులు తప్ప అన్ని షాపులనూ మూసేస్తున్నట్టు ఆ రాష్ట్ర సీఎం విజయ్ రూపానీ తెలిపారు. గవర్నమెంట్ సర్వీసులు మాత్రం మార్చి 29 వరకు 50 శాతం క్లాస్ 3, క్లాస్ 4 సిబ్బందితో పని చేస్తాయన్నారు.
చత్తీస్, నాగాలాండ్ లాక్డౌన్
చత్తీస్గఢ్ కూడా రాష్ట్రంలోని అన్ని పట్టణాలను లాక్డౌన్ చేస్తున్నట్టు ప్రకటించింది. వైరస్ను ఆపడానికి ప్రపంచవ్యాప్తంగా పాటిస్తున్న బెస్ట్ పద్ధతి ఇదేనని ఆ రాష్ట్ర సీఎం భూపేశ్ బాఘల్ అన్నారు. నాగాలాండ్ కూడా లాక్ డౌన్ ఆర్డర్స్ ఇచ్చేసింది. పశ్చిమ బెంగాల్ 31 వరకు అంతా మూసేస్తున్నట్టు వెల్లడించింది. ఉత్తరప్రదేశ్లోనూ 15 జిల్లాలను బుధవారం వరకు లాక్డౌన్ చేస్తున్నట్టు ప్రకటించారు. హర్యానాలో 7 జిల్లాల్లో మార్చి 31 వరకు లాక్డౌన్ చేశారు. కోల్కతా నగరం షట్డౌన్ అయింది. నోయిడా నగరం కూడా లాక్డౌన్ అయిపోయింది. ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి డొమెస్టిక్ ఫ్లైట్లు నడుస్తాయని డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెల్లడించింది. కలకత్తా ఎయిర్పోర్టు నుంచి కూడా డొమెస్టిక్ ఫ్లైట్లు నడుస్తాయని ఎయిర్పోర్టు ప్రకటించింది.
మే వరకు సరిపడా గోధుమలు ఫ్రీ: రాజస్థాన్
వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి మార్చి 22 నుంచి 31 వరకు రాష్ట్రాన్ని పూర్తిగా లాక్డౌన్ చేస్తున్నామని రాజస్థాన్ సర్కారు ప్రకటించింది. అత్యవసర సేవలే పనిచేస్తాయని ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు, మాల్స్, షాపులు, ఫ్యాక్టరీలు, ప్రజా రవాణా మూసేస్తున్నామన్నారు. లాక్డౌన్ టైంలో ప్రజలకు ఆహారానికి సమస్య లేకుండా కోటి కంటే ఎక్కువ కుటుంబాలకు మే వరకు ఫ్రీగా గోధుమలు లభిస్తాయని సీఎం ట్వీట్ చేశారు. వీధి వ్యాపారులు, రోజువారీ కార్మికులకు ఏప్రిల్ 1 నుంచి రెండు నెలల పాటు ఫ్రీగా ఆహార ప్యాకెట్లు అందిస్తామన్నారు. రాజస్థాన్లో తాజాగా 8 కొత్త కేసులు నమోదయ్యాయి.
కుటుంబం నుంచి ఒక్కరే: పంజాబ్
రాజస్థాన్లాగే పంజాబ్ కూడా లాక్డౌన్ ప్రకటించింది. మార్చి 31 వరకు అంతా బంద్ చేస్తున్నట్టు వెల్లడించింది. నిత్యావసర సేవలు పొందేందుకు ప్రతి కుటుంబం నుంచి ఒక్కరినే బయటికి వచ్చేందుకు అనుమతిస్తామని చెప్పింది. పాలు, ఆహారం, మెడిసిన్ షాపుల్లాంటి నిత్యావసర వస్తువులమ్మే దుకాణాలు మినహా అన్ని వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. లాక్డౌన్ పర్యవేక్షణకు ఓ టాస్క్ ఫోర్స్ టీమ్ను ఆ రాష్ట్రం ఏర్పాటు చేసింది. పంజాబ్లో ప్రస్తుతం 14 పాజిటివ్ కేసులున్నాయి. శనివారం 11 మందికి కరోనా సోకినట్టు వెల్లడైంది.
చండీగఢ్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బంద్
చండీఘర్లో 6 పాజిటివ్ కేసులు నమోదవడంతో ముందు జాగ్రత్తగా మార్చి 31 వరకు అంతా బంద్ చేస్తున్నట్టు అక్కడి అధికారులు ప్రకటించారు. ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలు, ఫ్యాక్టరీలు, ఇతర బిజినెస్ కార్యక్రమాలు జరగవన్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్టు కూడా బంద్ చేస్తున్నామని చెప్పారు. అందరూ ఇండ్లల్లోనే ఉండాలని, అర్జెంటయితేనే బయటకు రావాలని సూచించారు. అత్యవసర, ఆహార పదార్థాల సర్వీసులు, రేషన్ షాపులు తెరిచే ఉంటాయన్నారు.
For More News..