
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మావోయిస్టు పార్టీకి చెందిన 14 మంది భద్రాద్రి కొత్తగూడెం పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టుల వివరాలను ఎస్పీ బి.రోహిత్రాజ్ మంగళవారం వెల్లడించారు. లొంగిపోయిన వారిలో ఏసీఎం క్యాడర్కు చెందిన ఇద్దరు, నలుగురు మెంబర్లు, ముగ్గురు మిలీషియా సభ్యులతో పాటు, మరో ఐదుగురు ఉన్నారన్నారు. లొంగిపోయిన వారిలో ఒక్కరు తప్ప మిగతా వారంతా చత్తీస్గఢ్కు చెందిన వారేనని చెప్పారు.
మహారాష్ట్ర సౌత్ గోదావరి ఏరియా కమిటీలో పనిచేస్తున్న సోడి బుద్ర, వాజేడు – వెంకటాపురం ఏరియా కమిటీలో పనిచేస్తున్న కలమ ఇడిమా, పాదం నందె, మడవి జోగా, కుంజం కోస, ఎల్.సుక్రాం, పోడియం హిడ్మా, మడవి, మంగా, కడితి నందె, కుర్సం సమ్మయ్య, మడవి కామ, ఎన్. లక్మా, పోడియం జోగా, మడవి సహదేవ్లు లొంగిపోయిన వారిలో ఉన్నార్ననారు.
కర్రెగుట్టల్లో ఎన్కౌంటర్, మహిళా మావోయిస్ట్ మృతి
భద్రాచలం, వెలుగు : చత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఊసూరు బ్లాక్ కర్రె గుట్టల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఓ మహిళా మావోయిస్ట్ చనిపోయింది. బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపిన వివరాల ప్రకారం... సీఆర్పీఎఫ్, బస్తర్ ఫైటర్స్, సీఏఎఫ్, బీఎస్ఎఫ్, డీఆర్జీ, ఐటీబీపీ, ఎస్టీఎఫ్ బలగాలు సోమవారం కర్రె గుట్టల్లో కూంబింగ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో మావోయిస్టులు ఎదురుపడడంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు మొదలయ్యాయి. ఈ కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు చనిపోయినట్లు ఐజీ తెలిపారు. ఘటనా స్థలంలో 303 రైఫిల్ దొరికిందని, పారిపోయిన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని చెప్పారు.
ఉపసర్పంచ్ను హత్య చేసిన మావోయిస్ట్లు
చత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ఓ ఉప సర్పంచ్ను మావోయిస్టులు కాల్చి చంపేశారు. సుక్మా జిల్లా జేగురుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని తార్లగూడెం ఉపసర్పంచ్ ముచ్చికా రామా బేనంపల్లి సోమవారం రాత్రి తన ఇంట్లో పడుకున్నాడు. ఈ టైంలో మావోయిస్టులు వచ్చి అతడిని తమ వెంట తీసుకెళ్లారు. సమీపంలోని అడవుల్లోకి తీసుకెళ్లిన తర్వాత.. పోలీస్ ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నావంటూ కాల్చి చంపారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు జేగురుగొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.