14 మంది కాంగ్రెస్ అభ్యర్థులకు బీ ఫామ్​లు

14 మంది కాంగ్రెస్ అభ్యర్థులకు బీ ఫామ్​లు
  • గాంధీభవన్​లో అందుకున్న దానం, చామల, నీలం మధు  
  • మిగతా అభ్యర్థుల తరఫున వారి ప్రతినిధులకు అందజేత

హైదరాబాద్, వెలుగు:  కాంగ్రెస్ ప్రకటించిన14 మంది ఎంపీ అభ్యర్థులకు మంగళవారం గాంధీ భవన్ లో బీ ఫామ్ లను అందజేశారు. గాంధీ భవన్ కు వచ్చి బీ ఫామ్ తీసుకున్న వారిలో పార్టీ అభ్యర్థులు దానం నాగేందర్, నీలం మధు, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. మిగతా ఎంపీ అభ్యర్థుల తరపున వారి ప్రతినిధులు వచ్చి బీ ఫామ్ తీసుకెళ్లారు. వీరితో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థి శ్రీగణేశ్ తరపున ఆయన తమ్ముడు సురేశ్ కుమార్ బీ ఫామ్ అందుకున్నారు.  

ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ లు జగ్గారెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్ బీ ఫామ్ లను అందజేశారు. బీ ఫామ్ అందుకున్న తర్వాత సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ తన టికెట్ కోసం గట్టిగా ప్రయత్నించారని, ఆయనకు రుణపడి ఉంటానన్నారు.

మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ పోటీ చేసిన మెదక్ నుంచి తనకు బీ ఫామ్ రావడం సంతోషంగా ఉందన్నారు. ఇక్కడి నుంచి అత్యధిక మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 25 ఏండ్ల తన కష్టాన్ని ఏఐసీసీ గుర్తించిందని, కాంగ్రెస్ లోనే ఇది సాధ్యమన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తన గెలుపు కోసం బాగా సపోర్టు చేస్తున్నారని చెప్పారు. ఎంపీగా గెలిచి పార్లమెంట్ లో ప్రజా సమస్యలపై కొట్లాడతానన్నారు.