తెలంగాణలో 4 రోజుల్లో 14 మంది మృతి

తెలంగాణలో 4 రోజుల్లో 14 మంది మృతి

4 రోజుల్లో 14 మంది మృతి
శుక్రవారం మరో ముగ్గురు బలి
62 కొత్త కేసులు.. అందులో వలస కూలీలు 19 మంది
హైదరాబాద్​లోనే 42 మందికి
1,761కి చేరిన కరోనా కేసులు
డిటెక్టివ్​ ఇన్​స్పెక్టర్​కు పాజిటివ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. 4 రోజుల్లోనే 14 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. గురువారం ఐదుగురు, శుక్రవారం ముగ్గురు చనిపోయినట్టు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. అయితే మరణించిన వారి వివరాలను మాత్రం వెల్లడించలేదు. దీంతో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 48కి పెరిగింది. శుక్రవారం 62 కొత్త కేసులు నమోదయ్యాయి. గ్రేటర్​ హైదరాబాద్​లోనే 42 కేసులు రికార్డయ్యాయి. రంగారెడ్డిలో ఒక కేసు నమోదైంది. వేరే రాష్ర్టాల నుంచి తిరిగొచ్చిన, వివిధ జిల్లాలకు చెందిన 19 మంది వలస కూలీలకు పాజిటివ్​ వచ్చింది. దీంతో కరోనా బారిన పడిన వలస కార్మికుల సంఖ్య 116కు చేరింది. వీటితో కలిపి రాష్ర్టంలో మొత్తం కేసుల సంఖ్య 1,761కి పెరిగింది. ఇందులో 1,043 మంది డిశ్చార్జ్​ అవగా, 670 మంది ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారు.

డిటెక్టివ్​ ఇన్​స్పెక్టర్​కు కరోనా
బాలాపూర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో పనిచేస్తున్న ఓ డిటెక్టివ్ ​​ఇన్​స్పెక్టర్​‌‌కు కరోనా సోకింది. కొన్నిరోజులుగా అతడు షాహీన్​నగర్​లో డ్యూటీ చేస్తున్నాడు. వారం రోజులుగా జలుబు, దగ్గుతో బాధపడుతున్నాడు. ఫీవర్​ హాస్పిటల్​లో టెస్టులు చేయడంతో కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో అతడితో కలిసి పని చేసిన పోలీసులను క్వారంటైన్​కు తరలించారు. గల్ఫ్​ దేశాల నుంచి వచ్చి హోటల్​ క్వారంటైన్​లో ఉన్న నిజామాబాద్​ జిల్లాకు చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్​ వచ్చినట్టు తెలుస్తోంది. ఇదే జిల్లాలో మహారాష్ర్ట నుంచి తిరిగొచ్చిన మరో ఇద్దరికి వైరస్​ ఉన్నట్టు తేలింది. జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో గురువారం ఒకరికి వైరస్​ పాజిటివ్ వచ్చింది. అతడు ఈ నెల 14న ముంబై నుంచి వచ్చినట్టు అధికారులు ప్రకటించారు. జగిత్యాల జిల్లాలో శుక్రవారం ముంబై నుంచి వచ్చిన 9 మందికి కరోనా వచ్చినట్టు తేలింది.

For More News..

జూన్ 8 నుంచి టెన్త్ ఎగ్జామ్స్

పడిపోయిన టమాట రేటు

పంటల మ్యాపింగ్‌ షురూ