పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారం పరిధిలో 144 సెక్షన్ విధించారు. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు పోటాపోటీగా చలో ఆర్ఎఫ్సీఎల్ కు పిలుపునిచ్చారు. ఆర్ఎఫ్సీఎల్ ఉద్యోగాల పేరుతో అధికార పార్టీ నాయకులు అక్రమ వసూళ్లు చేశారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. బాధితులకు అండగా చలో రామగుండం కార్యక్రమానికి తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు ఎం. ఎస్. రాజా ఠాకూర్ సైతం ధర్నా చేస్తామని ప్రకటించారు. మరోవైపు ఫ్యాక్టరీ గేటు ఎదుట బహిరంగ చర్చకు సిద్ధమంటూ స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చలో ఆర్ఎఫ్సీఎల్ కు పిలుపును ఇచ్చారు.
అందులో భాగంగా కర్మాగారం వద్ద చర్చకు బయలుదేరారు. కానీ.. అనుమతి లేదంటూ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నరు. పోలీసులకు టీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తీన్మార్ మల్లన్నకు, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. RFCILలో ఉద్యోగాల పేరుతో లక్షల రూపాయలు ఎమ్మెల్యే చందర్, టీఆర్ఎస్ నాయకులు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. ఈనేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో ఫ్యాక్టరీ గేటు నుంచి 3 కిలోమీటర్ల మేర పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఇందులో భాగంగా టౌన్ షిప్ లో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ కు యాజమాన్యం సెలవు ప్రకటించింది. ముందస్తుగా పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు.